
వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్ మహిళలతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ఆసీస్.. 144 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ(68),తహ్లియా మెక్గ్రాత్(57),గార్డెనర్(48) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు మూడు వికెట్లు తీయగా..అమేలియా కెర్, హన్నా రోవ్, మాకే చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. 30.2 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టి కివీస్ మహిళల పతనాన్ని శాసించింది. ఆమెకు తోడు వెల్లింగ్టన్, గార్డెనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీ సాటర్త్వైట్(44) ఒక్కతే ఒంటరి పోరాటం చేయగా.. మిగితా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది.
గత మ్యాచ్లో భారత్ను చిత్తుగా ఓడించిన ఆతిథ్య కివీస్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైంది. వెస్టిండీస్ భారీ విజయాన్నందుకున్న భారత్ 4 పాయింట్లతో పాటు మెరుగైన రన్రేట్తో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్లు సైతం నాలుగేసి పాయింట్లతో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మహిళలు ఇంత వరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. టాప్ -4లో నిలిచే జట్లు నాకౌట్ మ్యాచ్లు ఆడనున్నాయి.