మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో బంగ్లాదేశ్కు మరోసారి నిరాశే ఎదురైంది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. 233 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. షర్మీన్ అక్తెర్(77 బంతుల్లో 6 ఫోర్లతో 50), షోర్నా అక్తెర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫర్గాన హోక్(76 బంతుల్లో 3 ఫోర్లతో 30), కెప్టెన్ నిగర్ సుల్తానా(42 బంతుల్లో 5 ఫోర్లతో 32) పర్వాలేదనిపించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో మ్లబా రెండు వికెట్లు తీయగా.. నదినే డీ క్లెర్క్, చోలె ట్రయాన్ చెరో వికెట్ తీసారు. అనంతరం సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్లకు 235 పరుగులు చేసి గెలుపొందింది. మరోసారి నదినే డీక్లెర్క్ (29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ 37 నాటౌట్)తో సౌతాఫ్రికా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. చోలె ట్రయాన్(69 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 62), మరిజన్నే కాప్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద అక్తెర్(2/44) రెండు వికెట్లు తీయగా.. రబెయ ఖాన్, ఫహిమా ఖాటున్, రిటూ మోనీ తలో వికెట్ తీసారు.

సౌతాఫ్రికా విజయానికి చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. రబెయా ఖాన్ 49 ఓవర్లో 5 పరుగులే ఇచ్చింది. దాంతో చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. నహిదా వేసిన ఈ ఓవర్ తొలి బంతినే డీక్లెర్క్ బౌండరీ బాదింది. మరుసటి బంతిని డాట్ చేసిన ఆమె.. మూడో బంతిని సిక్సర్ తరలించి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన చోలె ట్రయాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ మూడో పరాజయంతో తమ 6వ స్థానంలో నిలిచి తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టాప్-4లో ఉన్న జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.