మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు ప్రతికా రావల్(134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 122), స్మృతి మంధాన(95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 109) భారీ శతకాలతో చెలరేగారు.
దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(55 బంతుల్లో 11 ఫోర్లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కేర్, సుజీ బేట్స్, రోజ్మేరీ మైర్ చెరో వికెట్ తీసారు. వర్షం అంతరాయం కలిగించడంతో భారత ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించిన అంపైర్లు.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

సెమీ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. 49 బంతుల్లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించగా.. ప్రతికా రావల్ 75 బంతుల్లో అర్థశతకాన్ని అందుకుంది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా మంధాన భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. 88 బంతుల్లో మంధాన శతకం సాధించగా.. ప్రతికా రావల్ 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 212 పరుగులు జోడించిన అనంతరం మంధానను సుజీ బేట్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి వచ్చిన జెమీమా కూడా నిలకడగా ఆడగా.. ప్రతికా రావల్ను అమెలియా కేర్ ఔట్ చేశాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జెమీమా చెలరేగింది. 48 ఓవర్లు పూర్తయ్యే సరికి వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. భారత్ ఒకే ఓవర్ ఆడింది. ఈ ఓవర్లో హర్మన్ప్రీత్ కౌర్ ఔటవ్వగా.. జెమీమా, రిచా ఘోష్ చెరో బౌండరీ బాదారు. దాంతో భారత్ స్కోర్ 340 పరుగులకు చేరింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోర్.