మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత మూడో మ్యాచ్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. దాంతో హ్యాట్రిక్ పరాజయం తప్పదని అంతా అనుకున్నారు. కానీ బౌలర్లు సంచలన ప్రదర్శనతో న్యూజిలాండ్ను గట్టెక్కించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసింది. బ్రూక్ హాలిడే(104 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69), కెప్టెన్ సోఫీ డివైన్(85 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 63) విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. లక్ష్య ఛేదనలో పేసర్లు జెస్ కెర్(3/21), లీ తహుహు(3/22), రోజ్మేరీ(2/20) విజృంభించడంతో బంగ్లాదేశ్ 39.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది.

ఆ జట్టులో ఫాహిమా ఖాతూన్(34), రబేయా ఖాన్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో న్యూజిలాండ్ ఐదో స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ ఆరో స్థానానికి పడిపోయింది. ఒక్క విజయం కూడా నమోదు చేయని శ్రీలంక, పాకిస్థాన్లు అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా టాప్ 4లో కొనసాగుతున్నాయి.
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్ దక్కాలంటే తమ తదుపరి 4 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు అయినా గెలవాలి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్ల్లో శ్రీలంక, పాకిస్థాన్, భారత్, ఇంగ్లండ్తో ఆడాల్సి ఉంది. పాకిస్థాన్, శ్రీలంకతో గెలిచే అవకాశం ఉన్నా.. భారత్, ఇంగ్లండ్ను ఓడించాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాలి. మరోవైపు బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్తో తలపడాల్సి ఉంది. అద్భుతం జరిగే తప్పా ఈ నాలుగు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించలేదు.
నేటి వరల్డ్ కప్ మ్యాచ్లో శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జియోహాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.