మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన హైస్కోరింగ్ గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. లోయరార్డర్ వైఫల్యం.. చెత్త బౌలింగ్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 విజయాలు 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్.. తదుపరి మ్యాచ్ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో తలపడనుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్స్ టేబుల్లో టాప్-4లో ఉన్న జట్లే సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే తమ తదుపరి మూడు మ్యాచ్లకు మూడు గెలవాలి. అప్పుడే ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తోంది.

అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా.. సెమీఫైనల్ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆఖరి మూడు మ్యాచ్ల్లో రెండు ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. మరో అవకాశం లేకుండా టీమిండియా ఇంటిబాట పడుతుంది. ఈ క్రమంలోనే కనీసం రెండు మ్యాచ్లు గెలవాలి. అయితే బంగ్లాదేశ్ మినహా రెండు జట్లు టీమిండియాకు కఠినమైనవే. ఆస్ట్రేలియాతో ఓటమి టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ను మరిచిపోయి టీమిండియా తదుపరి మ్యాచ్కు సిద్దం కావాలి.
ఏ ఒక్కరి ప్రదర్శనపైన ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, ప్రతికా రావల్, జెమీమా రోడ్రిగ్స్ ఫామ్లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపిస్తే టీమిండియాకు తిరుగుండదు.
లోయారార్డర్లో రిచా ఘోష్ సూపర్ ఫామ్లో ఉండటం, స్నేహ్ రాణా రాణిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇతర ప్లేయర్లు కూడా బాధ్యతగా బ్యాటింగ్ చేస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో టీమిండియా బౌలింగ్ లుకలుకలు తెలిసొచ్చాయి. స్పిన్నర్లు మినహా పేసర్లు సత్తా చాటలేకపోతున్నారు. శ్రీ చరణి, దీప్తి శర్మ, స్నేహ్ రాణా పర్వాలేదనిపిస్తున్నా.. క్రాంతి గౌడ్, అమన్ జోత్ ధారళంగా పరుగులిస్తున్నారు. వీలైనంత త్వరగా బౌలింగ్ వైఫల్యాన్ని అధిగమిస్తేనే భారత్ సెమీస్ చేరగలదు.