మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఇంగ్లండ్తో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా చేజార్చుకుంది.
చివర్లో అనవసర షాట్లతో వికెట్లు పారేసుకొని మూల్యం చెల్లించుకుంది. కీలక సమయంలో స్మృతి మంధాన, దీప్తి శర్మ ఔటవ్వడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన భారత్ 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్ల్లో నాలుగేసి విజయాలతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్స్ టేబుల్లో టాప్-3లో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి.
నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగే తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాలుగో జట్టుగా సెమీస్ చేరుతుంది.
న్యూజిలాండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ్పై విజయం సాధిస్తే ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడాలి. భారత్ రన్రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. న్యూజిలాండ్పై గెలిచి.. బంగ్లాదేశ్ చేతిలో ఓడినా భారత్కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే కివీస్ కంటే భారత్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. దాన్ని అలా కాపాడుకుంటే భారత్కు తిరుగుండదు. న్యూజిలాండ్తో గెలవడం భారత్కు కీలకం.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. అప్పుడు భారత్ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే మెరుగైన రన్రేట్తో ముందంజ వేస్తోంది. చివరి మ్యాచ్లో ఓడితే.. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఓడాలి. అప్పుడు భారత్ ముందడుగు వేస్తోంది. న్యూజిలాండ్తో గురువారం జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.