మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్ రేసు నుంచి పాకిస్థాన్ అధికారికంగా నిష్క్రమించింది. వరుస పరాజయాలతో లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. 6 మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఫలితం తేలకపోగా.. నాలుగు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. మంగళవారం సౌతాఫ్రికాతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసింది. కెప్టెన్ లౌరా వోల్వార్డ్(82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 90), సున్ లూస్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), మరజన్నే కాప్(43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సదియా ఇక్బాల్(3/63), నష్రా సంధు(3/45) మూడేసి వికెట్లు తీయగా.. ఫతిమా సనా ఒక వికెట్ పడగొట్టింది.

పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా నిర్ణయించారు. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 83 పరుగులే చేసి ఓటమిపాలైంది. సిద్రా నవాజ్(22 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. సఫారీ బౌలర్లలో మరిజన్నే కాప్(3/20) మూడు వికెట్లు తీయగా.. షాంగేజ్(2/19) రెండు వికెట్లు పడగొట్టింది.
ఈ పరాజయంతో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ అధికారికంగా నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. పాకిస్థాన్ నిష్క్రమణతో ఈ టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ భారత్ వేదికగా జరగనున్నాయి. నవీ ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ చేరినా ఆ మ్యాచ్లు కొలంబో వేదికగా జరిగేవి.
ఈ గెలుపుతో సౌతాఫ్రికా టాప్ ప్లేస్లో నిలవగా.. ఆసీస్, ఇంగ్లండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు జట్లు సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీస్కు ఇండోర్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 30న రెండో సెమీస్ నవీ ముంబైలో జరగనుంది. నవంబర్ 2న ఫైనల్ జరగనుంది. గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్కు బెర్త్కు చేరువవుతోంది. ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి.