
వరుస ఓటములు..
ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత్.. ఫేవరేట్ కాకున్నా గట్టి పోటీదారేనని అనడంలో సందేహం లేదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజులు ఆటకు దూరమై.. తిరిగి మొదలెట్టాక భారత్ వరుస వైఫల్యాలను ఎదుర్కొంది. సరైన ప్రాక్టీస్ లేని భారత్.. సొంతగడ్డపై సౌతాఫ్రికాకు సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ సిరీస్లను చేజార్చుకుంది. ప్రపంచకప్ ముంగిట తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ ఓటమిపాలైంది. 1-4తో సిరీస్ను చేజార్చుకుంది. ఈ ప్రదర్శన కచ్చితంగా జట్టుపై అంచనాలను గణనీయంగా తగ్గించింది. అయితే ఓడిపోయినా.. ఆ సిరీస్లో 250+ స్కోర్లు సాధించడం సానుకూలాంశం. ఈ నెల 6న ప్రపంచకప్ తొలి మ్యాచ్ (పాకిస్థాన్తో)కు ముందు ఫామ్ను అందుకుని, రెండు సన్నాహక మ్యాచ్ల్లో గెలవడం మిథాలీ బృందం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అసలు టోర్నీలో ఎలా రాణిస్తారో చూడాలి.

మిథాలీ సేన బలం ఇదే..
పేపర్పై చూస్తే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన రూపంలో స్టార్ ఓపెనర్ భారత్ సొంతం. ఆమె దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ను నిర్మించగలదు. ధనాధన్ బ్యాటింగ్తో మెరుపు ఆరంభాలనిచ్చే యువ షెఫాలీ వర్మ కూడా జట్టులో ఉండడం భారత్కు బలం. బంతి ఏమాత్రం గతి తప్పినా..షెఫాలీ శిక్షించకుండా వదలదు. ఆమె సామర్థ్యం మేరకు రాణిస్తే భారత్కు తిరుగుండదనడంలో సందేహం లేదు. ఇక అత్యంత అనుభవజ్ఞురాలైన కెప్టెన్ మిథాలీ రాజ్ సుదీర్ఘ ఇన్నింగ్స్తో జట్టుకు వెన్నెముకలా నిలుస్తుంది.21 ఏళ్ల యాస్తిక భాటియా కూడా బ్యాటుతో ఆశలు రేపుతోంది. మిడిల్ ఆర్డర్లో హర్మన్ప్రీత్ లాంటి బ్యాటర్ ఉండడం భారత్కు సానుకూలాంశమే. అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ, వికెట్కీపర్ రీచా ఘోష్ కూడా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్కు జట్టు స్కోరును 270 దాటించే సత్తా ఉంది. ఈ బ్యాటింగ్ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.

సరైన ఫినిషర్స్ లేరు..
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టుకు సరైన ఫినిషర్స్ లేకపోవడమే బలహీనతగా మారింది . ఈ కారణం వల్లే గతంలో అనేక వన్డే మ్యాచ్ల్లో దెబ్బతింది కూడా. ఫినిషర్స్ లేకపోవడం వల్లే టాప్ ఆర్డర్ బలమైన పునాది వేస్తున్నా ఇతర జట్లలా 260-270 స్కోర్లను 300పై చిలుకు స్కోర్లుగా భారత్ చేయలేకపోతుంది. మరి ప్రపంచకప్లో ఈ సమస్యను భారత్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేసే బౌలర్లు లేకపోవడం కూడా భారత్కు ప్రలికూలాంశమే. మేఘన సింగ్తో కలిసి జులన్ గోస్వామి బౌలింగ్ దాడిని ఆరంభించే అవకాశముంది. వాళ్లకు పూజ వస్త్రాకర్, రేణుక సింగ్ సహకరిస్తారు. ఆల్రౌండర్ దీప్తి శర్మతో పాటు రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా స్పిన్ బాధ్యతలు చూసుకుంటారు. ఆఖరి ఓవర్లలో నాణ్యమైన బౌలర్లు లేకపోవడం వల్ల టోర్నీలో భారత్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. పేలవ ఫీల్డింగ్ కూడా భారత్కు ప్రతికూలాంశమే.

భారత మ్యాచ్ల షెడ్యూల్
మార్చి 6 ఇండియా x పాకిస్తాన్
మార్చి 10 ఇండియా x న్యూజిలాండ్
మార్చి 12 ఇండియా x వెస్టిండీస్
మార్చి 16 ఇండియా x ఇంగ్లండ్
మార్చి 19 ఇండియా x ఆస్ట్రేలియా
మార్చి 22 ఇండియా x బంగ్లాదేశ్
మార్చి 27 ఇండియా x సౌతాఫ్రికా
(అన్ని మ్యాచ్లు ఉ. 6.30 నుంచి)


Click it and Unblock the Notifications












