
హైదరాబాద్: 'ఎంకి పెళ్లి సుబ్బి చావు'కు వచ్చినట్లుంది భారత మహిళల జట్టు పరిస్థితి. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. లేదంటే ఇంటిదారి పట్టడమే. ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ బెర్త్లను ఖారారు చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ పోటీపడుతున్నాయి.
ఇక ఆరంభంలో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మళ్లీ ఫామ్లోకి వచ్చింది. వరుసగా మూడు విజయాలతో సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. గురువారం ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 41.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ (32), సిద్రా నవాజ్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్ (3/17), సోఫీ ఎకెల్స్టోన్ (3/18) విజృంభించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలోనే ఒక వికెట్కు 107 పరుగులు చేసి విజయభేరి మోగించింది. డాని వ్యాట్ (76 నాటౌట్; 68 బంతుల్లో 11×4) అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించింది. పాక్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ రన్రేట్ గణనీయంగా మెరుగైంది. మొత్తం 6 పాయింట్లతో పట్టికలో భారత్ (6 పాయింట్లు)ను వెనక్కి నెట్టి నాలుగో స్థానం సాధించింది.
సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో సౌతాఫ్రికా 9 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంది. ఇక ఏడు పాయింట్లతో వెస్టిండీస్ మూడో స్థానంలో నిలిచి ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు సౌతాఫ్రికాతో చావో రేవో మ్యాచ్. గెలిస్తే సెమీస్కు ఓడితే ఇంటికే. ఒకవేళ వర్షంతో రద్దయితే మాత్రం 7 పాయింట్లతో పాటు మెరుగైన రన్రేట్తో సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది.
నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లే ఉండగా.. ఆ జట్టు చివరి మ్యాచ్ను పసికూన బంగ్లాదేశ్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో ఓడినా ఆ జట్టు భారత్ కంటే మెరుగైన రన్రేట్ కారణంగా(సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడితే) సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. భారత్ కన్నా ఇంగ్లండ్కే మెరుగైన అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మిథాలీ సేన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది.