
భారీ స్కోర్ చేసినా..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసారు. కెప్టెన్ మిథాలీ రాజ్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 68తో పాటు యస్తిక భాటియా(83 బంతుల్లో 6 ఫోర్లతో 59), హర్మన్ ప్రీత్ కౌర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో పూజా వస్త్రాకర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 34) మెరుపులు మెరిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు, అలన కింగ్ రెండు, జెస్స్ జొనాస్సెన్ ఓ వికెట్ తీసింది.

కొంపముంచిన బౌలర్ల వైఫల్యం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఓపెనర్ అలీసా హీలీ(65 బంతుల్లో 9 ఫోర్లతో 72), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(107 బంతుల్లో 13 ఫోర్లతో 97)భారీ హాఫ్ సెంచరీలతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో బెత్ మూనీ(20 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్) విజయాన్ని సులువు చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీయగా.. మేఘన సింగ్, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. జూలన్ గోస్వామి ఒక్క వికెట్ తీయకపోగా 64 పరుగులు సమర్పించుకుంది.

8 పరుగులు డిఫెండ్ చేయలేక..
చివరి 12 బంతుల్లో ఆసీస్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. 49వ ఓవర్ వేసిన మేఘన సింగ్ సూపర్ బౌలింగ్తో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో పాటు మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో భారత శిభిరంలో ఆశలు చిగురించాయి. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 8 పరగులు అవసరమవ్వగా.. జూలన్ గోస్వామి ఫస్ట్ బాల్కే బౌండరీ ఇచ్చింది. దాంతో మరింత స్వేచ్చగా ఆడిన బెత్ మూనీ మరో రెండు బంతుల్లోనే 2, 4తో మ్యాచ్ను ముగించింది. దాంతో భారత్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఆ రెండు జట్లు ఓడితేనే..
ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం 5 మ్యాచ్ల్లో మూడు ఓటములతో భారత మహిళలు నాలుగో స్థానంలో ఉన్నారు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్తో జరిగే తదుపరి మ్యాచ్ల్లో భారత్ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ మహిళలు, వెస్టిండీస్ టీమ్స్ ఇతర మ్యాచ్ల్లో ఓడితేనే భారత్కు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications












