Women's T20 World Cup: భారత్.. ఆసీస్ గండం గట్టెక్కెనా? నేడే కీలక సెమీఫైనల్!

కేప్టౌన్: ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ కలను సాకారం చేసుకోవాలన్న సంకల్ప బలంతో.. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో.. టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన భారత మహిళల జట్టుకు.. అసలు సిసలైన సవాల్ ఎదురైంది. గత ఆరు ప్రపంచకప్ల్లో ఐదు సార్లు విజేత, ఓ సారి రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియాతో నేడు(గురువారం) సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే సెమీఫైనల్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ను ఓడించాలంటే భారత్ స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సిందే!
రెండేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిన హర్మన్ సేన.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ మ్యాచ్లోనూ కంగారుల చేతిలో ఖంగుతిన్నది. ఈ రెండింటికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణవకాశం ఇప్పుడు భారత అమ్మాయిల ముందు ఉంది.

ఒక్కసారి గెలవలేదు..
గత రికార్డులు, గణాంకాలు, ప్రదర్శన, చరిత్ర ఇలా ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టే ఫేవరెట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మినహా మిగతా ఆరుసార్లు ఆ జట్టే ఫైనల్ చేరింది. అందులోనూ 2010 సెమీస్లో భారత్పై గెలిచింది. మరోవైపు ఈ టోర్నీ చరిత్రలో ఐదోసారి సెమీస్ ఆడుతున్న భారత్ ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. 2020లో ఇంగ్లండ్తో సెమీస్ వర్షంతో రద్దవ్వడంతో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా నేరుగా ఫైనల్ చేరింది. ఈ ప్రపంచకప్లోనూ హర్మన్సేన తడబడుతూనే సెమీస్ చేరింది. ఇంగ్లండ్తో ఓడిన జట్టు.. మిగతా మూడింట్లో నెగ్గి గ్రూప్-2 రన్నరప్గా ముందంజ వేసింది. మరోవైపు ఆసీస్ అజేయంగా నిలిచి గ్రూప్-1లో అగ్రస్థానంతో సెమీస్ బెర్త్ కైవసం చేసుకుంది.

ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే..
ఆసీస్ ఎంత పటిష్టంగా ఉన్నా సమష్టిగా రాణిస్తే విజయం సాధించవచ్చు. క్షణాల్లో ఫలితం తారు మారయ్యే టీ20 ఫార్మాట్లో సంచలనాలు నమోదు చేయడం అంత కష్టమేమి కాదు. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో కలిపి ఆసీస్ కేవలం రెండు మ్యాచ్ల్లోనే ఓడింది. ఆ రెండు సార్లు కూడా భారత్ చేతిలోనే ఓడిపోవడం మన అమ్మాయిలకు ఊరటనిచ్చే అంశం. ఈ ఫలితాల స్పూర్తితో మన అమ్మాయిలు చెలరేగితే విజయం సాధించవచ్చు.
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా సత్తాచాటాలి.

టాప్ బ్యాటర్లు చెలరేగితే..
ముఖ్యంగా బ్యాటింగ్లో నిలకడగా రాణిస్తున్న స్మృతి మంధాన కీలక మ్యాచ్లో కూడా అదే జోరు కనబర్చాలి. ఇక టీనేజీ సంచలనం, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం తన ఫామ్ను కొనసాగించాలి. లేడీ సెహ్వాగ్గా గుర్తింపు పొందిన షెఫాలీ శర్మ ధాటైన ఆరంభం అందించాలి. పాకిస్థాన్ మ్యాచ్లో కోహ్లీలా హాఫ్ సెంచరీ బాదిన జెమీమా..మరోసారి ఆ తరహా ప్రదర్శన చేయాలి. గతంలో వన్డే ప్రపంచకప్లో సంచలన బ్యాటింగ్తో భారత్ను ఒంటి చేత్తో గెలిపించిన హర్మన్ప్రీత్ కౌర్.. కెప్టెన్గా మరోసారి ఆ తరహాలో చెలరేగితే భారత్కు తిరుగుండదు. ముఖ్యంగా బంతులను వృథా చేయడం తగ్గించాలి.

పటిష్టంగా బౌలింగ్ విభాగం..
భారత బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఇంగ్లండ్పై 5 వికెట్లు ఘనతను అందుకున్న పేసర్ రేణుక సింగ్.. అదే జోరు కొనసాగించాల్సి ఉంది. ప్రధాన స్పిన్నర్ దీప్తి శర్మతో పాటు ఇతర బౌలర్లు ఉత్తమ ప్రదర్శన చేస్తే ఆసీస్ బ్యాటర్లను త్వరగా ఔట్ చేయవచ్చు. ముఖ్యంగా కెప్టెన్ మెగ్ లానింగ్, అలీసా హీలీ, బెత్ మూనీ, తహిల మెక్గ్రాత్, ఎలీస్ పెర్రీ, మెగాన్ షట్లను వీలైనంత త్వరగా ఔట్ చేయాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications