మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. బుధవారం శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఘన విజయంతో టీమిండియా తమ రన్రేట్ (0.560) కూడా మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్కు అర్హత సాధిస్తోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50), హర్మన్ప్రీత్ కౌర్(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. షెఫాలీ వర్మ(40 బంతుల్లో 4 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, అమా కాంచనా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రీలంక బ్యాటర్లలో కవిషా దిల్హరి(21), అనుష్క సంజీవణి(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుంధతి రెడ్డి(3/17), ఆశా శోభనా(3/19) మూడేసి వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. రేణుకా సింగ్(2/16) రెండు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్ , దీప్తి శర్మకు తలో వికెట్ దక్కింది.
తాజా విజయంతో గ్రూప్-ఏలో భారత్ రెండో స్థానానికి చేరింది. ప్రతీ గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీస్కు అర్హత సాధించనున్నాయి.