కాన్బెర్రా: వచ్చే నెలలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్కు ముందు సన్నాహకంగా జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్లో భారత్ బోణీ కొట్టింది. ఇంగ్లండ్ మహిళలతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 5 వికెట్లతో గెలుపొందింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. టామ్మీ బీమౌంట్(37), నటాలీ సివర్(20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే రెండేసి వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం ఛేజింగ్కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఇక భారత ఓపెనర్ షఫాలీ వర్మ(25 బంతుల్లో 4 ఫోర్లతో 30) రాణించగా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన(15) విఫలమైంది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(26) ఆకట్టుకోగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 42 నాటౌట్) అజేయంగా నిలిచి మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందించింది. చివర్లో వేద కృష్ణమూర్తి(7), తానియా బాటియా(11) విఫలమైనా.. క్రీజులోకి వచ్చిన దీప్తీ శర్మ(12 నాటౌట్) సాయంతో హర్మన్ ప్రీత్ లక్ష్యాన్ని పూర్తి చేసింది.
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్లు ఈ నెల 12న జరిగే ఫైనల్లో తలపడతాయి. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్ వరకు వచ్చి ఇంగ్లండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
అయితే కొత్త కోచ్ డబ్ల్యూవీ రామన్ నేతృత్వంలో టీమ్ ఆట ఇటీవల బాగా మారిపోయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్, ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమాలే ఇప్పటి వరకు బ్యాటింగ్ భారం మోస్తుండగా ఇతర ప్లేయర్లు కూడా మెరుగయ్యారు. ముఖ్యంగా టీనేజ్ సంచనలం షఫాలీ వర్మ ఆట జట్టుకు అదనపు బలంగా మారింది. ప్రపంచకప్ ముందు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్ను గెలుచుకొని రెట్టించిన ఉత్సాహంతో మెగా టోర్నీలో పాల్గొనాలని హర్మన్ సేన భావిస్తోంది.