పుణే: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో భాగంగా సూపర్ నోవాస్తో జరుగుతున్న మ్యాచ్లో వెలాసిటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్లకు కావాల్సినంత స్వేచ్చ ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెలాసిటి టీమ్ కెప్టెన్ దీప్తి శర్మ తెలిపింది. అలాగే చేజింగ్ చేయాలనేది తమ తొలి ప్రాధాన్యతని, బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన కనబర్చవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
సూపర్ నోవాస్ సారథి హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనుకున్నామని, చేజింగ్ చాలా కష్టమని చెప్పింది. 160 పరుగుల లక్ష్యం నిర్దేశించి.. తమ అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిని ఓడిస్తామని తెలిపింది. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన హర్మన్ ప్రీత్.. మంచి ఆరంభం అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేస్తే.. మేం చేయాల్సిన లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంది.
ఇక దీప్తి శర్మ కెప్టెన్సీలోని వెలాసిటీ తమ తొలి టైటిల్ను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. హర్మన్ప్రీత్ కెప్టెన్సీలోని లీడ్ సూపర్నోవాస్ ఈసారి రికార్డు స్థాయిలో మూడో ట్రోఫీని గెలిచి తీరాలని చూస్తోంది. ఇకపోతే సూపర్నోవాస్ ఏడు వికెట్ల తేడాతో గత మ్యాచ్లో వెలాసిటీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ట్రైల్బ్లేజర్స్పై 49పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది.
మరోవైపు వెలాసిటీ 16పరుగుల తేడాతో ట్రైల్బ్లేజర్స్తో తమ చివరి మ్యాచ్లో ఓడిపోయింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ జట్టు కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడంతో వెలాసిటీ ఫైనల్ చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ట్రైల్బ్లేజర్స్ ఎలిమినేట్ కావడంతో మహిళల టీ20 ఛాలెంజ్ టైటిల్ ఈసారి చేతులు మారనుంది.
తుది జట్లు:
సూపర్ నోవాస్: ప్రియా పూనియా, డియాండ్ర డాటిన్, హర్లీన్ డియోల్, తానియా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్, సునే లూస్,పూజా వస్త్రాకర్,అలానా కింగ్, సోఫీ ఎకెల్స్టోన్, మాన్సి జోషి, రాషి కనోజియా
వెలాసిటీ: షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా(కీపర్), కిరన్ నావిగిరే, లౌరా వోల్వార్డ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, సిమ్రాన్ బహదుర్, కేట్ క్రాస్, నత్తకమ్ చాంతమ్, అయబొంగ ఖాక