షార్జా: ఓవైపు ట్రయల్ బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మంధాన(49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మరోవైపు సూపర్ నోవాస్ బౌలర్ రాధా యాదవ్ (5/16) ఐదు వికెట్లతో విజృంభించింది. దాంతో మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్.. సూపర్ నోవాస్ ముందు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
మంధాన మినహా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్కు తోడుగా .. పూనమ్ యాదవ్, సిరివర్దనే చెరొక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ట్రయల్ బ్లేజర్స్కు ఓపెనర్లు మంధాన, డాటిన్(20) శుభారంభం అందించారు. డాటిన్ నిదానంగా ఆడినా.. మరోవైపు మంధాన చెలరేగింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని పూనమ్ యాదవ్ విడదీసింది. డాటిన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో ఫస్ట్ వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిచాతో మంధాన ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన మంధాన స్కోర్ బోర్డు పరుగెత్తించింది. కానీ సిరివర్దనే బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరింది. దాంతో ఒక్కసారిగా ట్రయల్ బ్లేజర్స్ సీన్ మారింది. భారీ స్కోర్ చేస్తుందనుకున్న జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. దీప్తీ శర్మ(9), రిచా గోష్(10), హర్లీన్ డియోల్(4), సోఫీ ఎక్లెస్టోన్(1), జూలన్ గోస్వామి(1), చాంటమ్ (0) వరుసగా పెవిలియన్ చేరారు. చివరి 5 ఓవర్లలో 17 పరుగులు చేసిన ట్రయల్ బ్లేజర్స్ 6 వికెట్లు కోల్పోయింది.