షార్జా: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ సూపర్నోవాస్ జూలు విదిల్చింది. కీలక లీగ్ మ్యాచ్లో సూపర్ ఆటతో అదరగొట్టింది. శనివారం ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో ట్రయల్బ్లేజర్స్పై 2 పరుగులతో నెగ్గి వరుసగా మూడోసారి మహిళల టీ20 చాలెంజ్(మహిళల ఐపీఎల్) ఫైనల్కు చేరింది. దాంతో మిథాలీ రాజ్ సారథ్యంలోని వెలాసిటీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' చమరి ఆటపట్టు జయాంగని (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. దీప్తి శర్మ (43 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయింది.
గెలుపు.. ట్రయల్ బ్లేజర్స్వైపు మొగ్గుతోన్న దశలో రాధా యాదవ్ (2/30) అద్భుత బౌలింగ్తో సూపర్ నోవాస్ను 2 పరుగులతో గెలిపించింది. బ్లేజర్స్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా... రాధ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ను దక్కించుకుంది. మూడు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు ముగిశాక మూడు జట్లూ ఒక్కో విజయంతో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్ కారణంగా స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ (+2.109), హర్మన్ప్రీత్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ (-0.054) జట్లు ఫైనల్లోకి ప్రవేశించగా... హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ (-1.869) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. సోమవారం జరిగే ఫైనల్లో ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ అమీతుమీ తేల్చుకుంటాయి.
సంక్షిప్తస్కోర్లు
సూపర్నోవాస్: 20 ఓవర్లలో 146/6 (చమరి ఆటపట్టు 67, హర్మన్ప్రీత్ 31, ప్రియా పూనియా 30, జులన్ 1/17, ఖాతూన్ 1/25, హర్లిన్ 1/34)
ట్రయల్బ్లేజర్స్: 20 ఓవర్లలో 144/5 (దీప్తి శర్మ 43, స్మృతి మంధాన 33, హర్లీన్ 27, రాధా యాదవ్ (2/30), షకీరా (2/31).