
సెల్హెట్(బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్లో ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం పాకిస్థాన్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న భారత్.. శనివారం ఆల్రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయిదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న యువ ఓపెనర్ షెఫాలి వర్మ( 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 55, 2/10) ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. షెఫాలి, స్మృతి మంధాన (38 బంతుల్లో 6 ఫోర్లతో 47) తొలి వికెట్కు 96 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఈ ఇద్దరూ బౌండరీల వేటలో పోటీపడ్డారు. స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరూ ఔటైనా సూపర్ ఫామ్లో ఉన్న జెమీమా ( 24 బంతుల్లో 4 ఫోర్లతో 35 నాటౌట్), దీప్తి (10)తో కలిసి జట్టు స్కోరును 160కి చేరువ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రుమానా (3/27) రాణించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మహిళలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 100 పరుగులే చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36) టాప్స్కోరర్. భారత బౌలర్లలో షెఫాలి, దీప్తి శర్మ (2/13) రెండేసి వికెట్లతో సత్తా చాటారు. గాయంతో హర్మన్ప్రీత్కౌర్ దూరమవడంతో ఈ మ్యాచ్కు స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది.
పిన్న వయస్సులో అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా షెఫాలి వర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్కే చెందిన జెమీమా (21 ఏళ్ల 32 రోజులు) రికార్డును ఆమె (18 ఏళ్ల 253 రోజులు) బద్దలు కొట్టింది. బంతుల (735) పరంగానూ అత్యంత వేగంగా అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన రికార్డూ ఖాతాలో వేసుకుంది.