
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ముంబైకి చెందిన ఓ గ్యాంగ్స్టర్ భార్య అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపేవాడని రెహ్నుమా తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుకి సంబంధించిన పేపర్లు నెట్టింట వైరల్గా మారింది. సెప్టెంబర్లో కేసు పెట్టినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, తనకు జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రెహ్నామా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కేసు వివరాలను వెల్లడించడానికి ముంబై పోలీస్ అధికారులు నిరాకరించారు. విచారణ జరుగుతుందని, ఇప్పుడేం చెప్పలేమన్నారు.
ఇక హార్ధిక్ పాండ్యా.. గతంలో 'కాఫీ విత్ కరణ్ షో'లో మహిళల పట్ల వివాదాస్పద కామెంట్లు చేసి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాపై భారత సెలెక్టర్లు వేటు వేసారు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు పక్కనపెట్టారు. దాంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాన్కోవిచ్తో కలిసి మాల్దీవుల్లో హాలీడే ట్రిప్కు వెళ్లినట్లు సమాచారం.
హార్దిక్ పాండ్యా ఫిట్గా లేకపోయినా.. టీ20 ప్రపంచకప్ వరకు అతనికి అండగా నిలిచిన బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యం అనంతరం అతనిపై వేటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను కేవలం బ్యాటర్గా జట్టులో కొనసాగించడం అనవసరమని సెలెక్టర్ల భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన బ్యాట్స్మన్ను రెడీ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే పృథ్వీ షా, శుభ్మన్ గిల్లను కాదని వెంకటేశ్ అయ్యర్కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఓపెనర్ అయినటు వంటి వెంకటేశ్ అయ్యర్ను మిడిలార్డర్ బ్యాట్స్మన్గా మార్చేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వెంకటేశ్ అయ్యర్తో హార్దిక్ పాండ్యాకు చెక్ పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.