
ఏ కంపెనీ సిద్దంగా లేదు..
కాగా, కొవిడ్ మహమ్మారి తరహా బీమా కోసం బోర్డు ప్రయత్నించినా.. ఏ కంపెనీ ముందుకు రాలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. 'కరోనా బీమా కోసం మా బీసీసీఐ టీమ్ ప్రయత్నాలు చేసింది. కానీ ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ గ్లోబల్ కంపెనీ కూడా ఈ తరహా బీమా ఇవ్వడం లేదు.'అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్కు సంబంధించి బీసీసీఐ వద్ద ఎలాంటి ఇన్సురెన్స్ లేదని, కరోనా కారణంగా లీగ్ రద్దయితే వారు భారీ నష్టాలు చవిచూస్తారని ఓ ఇన్స్రెన్స్ కంపెనీ కన్సల్టంట్ తెలిపాడు.

ప్రస్తుత పాలసీలో ఉన్నదేంటి?
ప్రస్తుత బీమా పాలసీలోని ఏడు క్లాజ్ల్లో ఏదో ఒకదాని కింద బీసీసీఐ నష్టపోతే.. దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భర్తీ చేయనుంది. సాధారణంగా ఉండే 'వాతావరణం అనుకూలించక పోవడం' క్లాజ్ కింద మ్యాచ్ లేదా లీగ్ రద్దయినా బోర్డుకు నష్టపరిహారం అందనుంది. దీంతోపాటు బంద్లు, జాతీయ లేదా రాష్ట్ర సంతాప దినాలు, మత ఘర్షణల కారణంగా జట్లు మ్యాచ్ సమయానికి చేరుకోలేక పోతే, ఉగ్రదాడులు లేదా బెదిరింపులు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు క్లాజ్ల కింద బీమా పొందవచ్చు.

చేతి నుంచి ఆటగాళ్ల జీతాలు..
ఒకవేళ బీమా ఉంటే ఆటగాళ్లకు పూర్తి జీతాలు అందేవి. ప్రస్తుతానికి మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే చెల్లించారు. మిగిలిన రెండు విడతలను టోర్నీ ముగిసిన తర్వాత, క్యాలెండర్ ఇయర్ తర్వాత చెల్లించాలనే రూల్ ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు షరతులు పూర్తికాలేదు. అయితే, బీమా లేకపోవడంతో.. లీగ్లో మిగతా మ్యాచ్లు జరగకపోతే మాత్రం క్రికెటర్ల జీతాలను ఫ్రాంచైజీలు తమ చేతి నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి.

యూకేలో ఐపీఎల్ 2021 సెకండాఫ్
మరోవైపు వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ(ఎస్జీఎం)లో ఈ విషయంపై చర్చించనుంది. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా భావిస్తోంది. అవసరమైతే భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ను కుదించి ఐపీఎల్ను సర్దుబాటు చేయాలనుకుంటుంది. ఈ మేరకు ఈసీబీతో బీసీసీఐ చర్చలు జరుపుతుంది. దీనికి ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
