హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ప్రముఖ విజ్డెన్ దిన పత్రిక బెస్ట్ ఎలెవన్ను ప్రకటించింది. గత రెండేళ్ల పాటు సాగిన ఈ మెగా ఛాంపియన్షిప్లో సత్తా చాటిన ఆటగాళ్లకు మాత్రమే తమ బెస్ట్ ఎలెవన్లో చోటిచ్చింది.
ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కింది.
స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే బ్యాటింగ్ విభాగంలో ఒక్క భారత ఆటగాడు కూడా ఈ టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్, వెన్ను గాయంతో జస్ప్రీత్ బుమ్రా కీలక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైనా.. బెస్ట్ ఎలెవన్కు ఎంపికయ్యారు.

ఈ ఛాంపియన్షిప్లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ఈ బెస్ట్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ఈ టోర్నీలో మొత్తం 17 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 932 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 12 మ్యాచ్ల్లో 868 రన్స్ చేయగా.. రవీంద్ర జడేజా 13 మ్యాచ్ల్లో 721 రన్స్ చేశాడు.
వికెట్ కీపర్గా రిషభ్ పంత్ అత్యుత్తమ డబ్ల్యూటీసీ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. ఈ బెస్ట్ ఎలెవన్ ఓపెనర్లుగా ఆసీస్ స్టార్ ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నే ఎంపికయ్యారు. మిడిలార్డర్లో ఆసీస్ స్టార్ మార్నస్ లబుషేన్, శ్రీలంక ప్లేయర్ దినేశ్ చండీమల్, ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో చోటు దక్కించుకున్నారు.
వికెట్ కీపర్గా పంత్ ఎంపికవ్వగా.. స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా అవకాశాన్ని అందుకున్నారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్యాట్ కమిన్స్, కగిసో రబడా బెస్ట్ ఎలెవన్కు ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయన్ అవకాశాన్ని అందుకున్నాడు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
విజ్డెన్ డబ్ల్యూటీసీ బెస్ట్ ఎలెవన్:
ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, మార్నస్ లబుషేన్, దినేశ్ చండిమల్, జాన్నీ బెయిర్ స్టో, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, నాథన్ లయన్, జస్ప్రీత్ బుమ్రా