ఇంగ్లండ్తో తొలి టెస్ట్ పరాజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఇది సమష్టి వైఫల్యమని, ఏ ఒకరి వల్లో ఈ పరాజయం ఎదురవ్వలేదని స్పష్టం చేశాడు. తమ జట్టు ఓడినా.. గెలిచినా.. కలిసికట్టుగానే చేస్తుందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్లో 570-580 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, లోయరార్డర్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. ఆటగాళ్లకు అండగా నిలిచాడు.
'ఈ మ్యాచ్ ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని లేదా జట్టును నిందించడానికి నేను ఇక్కడ లేను. మేం కలిసి గెలుస్తాం. కలిసి ఓడిపోతాం. భారత బౌలింగ్ విభాగం అనుభవం లేనిది. సిరాజ్, బుమ్రా మినహా మిగతా బౌలర్లకు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. వీరిలో ఒకరు మూడు, మరొకరు ఐదు మ్యాచ్లు ఆడితే.. ఇంకొకరు అరంగేట్రమే చేయలేదు. 2022లో జట్టులో 40 మ్యాచ్లు ఆడిన అనుభవం కలిగిన పేసర్లు ఉన్నారు కాబట్టి 20 వికెట్లు తీసేవారు. కానీ ప్రస్తుత బౌలింగ్ విభాగానికి అంత అనుభవం లేదు. వారికి తగిన సమయం ఇవ్వాలి. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లు భవిష్యత్తులో రాణించడానికి తగిన మద్దతు ఇవ్వాలి. కేవలం ఒక టెస్ట్ ఆధారంగా వారిని అంచనా వేయడం సరికాదు.

తొలి ఇన్నింగ్స్లో 570-580 పరుగులు చేసి ఉంటే మ్యాచ్పై పట్టు సాధించేవాళ్లం.లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం నిరాశకు గురిచేసింది. యశస్వి జైస్వాల్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడం సరికాదు. కానీ ఏ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా అలా చేయరు. వరల్డ్ బెస్ట్ ఆటగాళ్లు కూడా క్యాచ్లు వదిలేస్తారు. శార్దూల్ ఠాకూర్ను బౌలింగ్ ఆల్రౌండర్గానే జట్టులోకి తీసుకున్నాం. కానీ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ సహజంగానే తక్కువ ఓవర్లు ఇచ్చి ఉంటాడు. రెండో ఇన్నింగ్స్లో శార్దూల్ కీలకమైన రెండు వికెట్లు తీసాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి మ్యాచ్. అతనికి కాస్త సమయం ఇవ్వాలి. కెప్టెన్గా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అన్ని లక్షణాలు శుభ్మన్ గిల్లో ఉన్నాయి. కెప్టెన్గా అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు.
ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడుతాడు. అతను ఆడే తదుపరి రెండు మ్యాచ్లు ఏంటా? అనేవి ఇంకా నిర్ణయించలేదు. అతని వర్క్లోడ్ను మేం పరిశీలించాల్సి ఉంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడంతో పాటు రిషభ్ పంత్ రెండు సెంచరీలు చేశాడు. వాస్తవానికి ఇది అద్భుతమైన ఆరంభం.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.