ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సిడ్ జానిక్ సినెర్ 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో వరల్డ్ నెంబర్ 2, కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్)ను ఓడించాడు. ఈ గెలుపుతో 148 ఏళ్ల వింబుల్డన్ చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి ఇటాలీయన్ ప్లేయర్గా 22 ఏళ్ల సినెర్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి సినెర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఓటమితో హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్ గెలవాలనే అల్కరాజ్ కల చెదిరింది.
మూడు గంటల 4 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో జానిక్ సినెర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఈ మ్యాచ్లో అల్కరాజ్ తొలి సెట్ను 6-4తో గెలిచి శుభారంభం చేసినా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను కోల్పోయాడు. తొలి సెట్ ఓడిన జానిక్ సినెర్ అద్భుతంగా పుంజుకొని వరుసగా మూడు సెట్లను 6-4తో కైవసం చేసుకొని కెరీర్లో లోటుగా ఉన్న వింబుల్డన్ టైటిల్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్లో అల్కరాజ్ 15 ఏస్లు సంధించి 7 డబుల్ పాల్ట్స్ చేశాడు. మరోవైపు జానిక్ సిన్నర్ 8 ఏస్లు సంధించి.. 2 డబుల్ ఫాల్ట్స్ మాత్రమే నమోదు చేశాడు. జానిక్ సిన్నర్ 4 బ్రేక్ పాయింట్స్ సాధించగా.. కార్లోస్ అల్కరాజ్ 2 మాత్రమే అందుకున్నాడు. సినర్ 125 పాయింట్స్ గెలిస్తే.. అల్కరాజ్ 113కు మాత్రమే పరిమితమయ్యారు.
వింబుల్డన్ విజేతగా నిలిచిన సినర్కు రూ. 34 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. ఇది గతేడాది కంటే 11శాతం ఎక్కువ. రన్నరప్ అల్కరాజ్ రూ. 17.65 కోట్ల ప్రైజ్మనీ అందుకోనున్నాడు. గతేడాది కంటే ఇది 8.6 శాతం ఎక్కువ.
సినర్కు ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా.. నాలుగో గ్రాండ్ స్టామ్ టైటిల్. గతేడాది, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన సినెర్.. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సాధించాడు. వింబుల్డన్లో అల్కరాజ్ జైత్రయాత్రకు సినెర్ కళ్లెం వేసాడు. వరుసగా 24 విజయాల తర్వాత అల్కరాజ్ ఓటమిపాలయ్యాడు. గత రెండేళ్లలో సినెర్ నాలుగు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్లు, నాలుగు ఏటీపీ మాస్టర్స్ 1000 ట్రోఫీలు, 2024 నిట్టో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు.