
లాహోర్: నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పునరాగమనంలో సత్తాచాటాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరుగుతున్న సిరీస్కు అనూహ్యంగా జట్టులోకి వచ్చిన మాలిక్.. అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ఓ రిపోర్టర్ ఇరకాటంలో పడేసే ప్రశ్న అడగ్గా తనదైన శైలిలో సమాధానమిచ్చి ఔరా అనిపించాడు.
'మాలిక్.. ఓ సీనియర్ ప్లేయర్గా జట్టులోని ఆటగాళ్లను సిద్ధం చేయడం మీ బాధ్యత అని చెబుతున్నారు? అలాగే.. మీ కోచ్ కన్నా మీరే సీనియర్. మీ కోచ్కు కూడా ఏమైనా చెబుతున్నారా?'అని రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి మాలిక్ సమాధానమిస్తూ.. 'ఈ ప్రపంచంలో ఎవరూ అన్నీ నాకు తెలుసని, అన్నీ నేర్చేసుకున్నానని చెప్పరు. సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్లో మొత్తం నేర్చుకున్నానని చెప్పలేదు. ఎవరూ కూడా అలా అనలేదు. కాబట్టి అధ్యాయనమనేది నిరంతరం సాగే ప్రక్రియ. దానికి ఎప్పుడూ అంతం ఉండదు. ఎంతో మంది కోచ్లు వస్తుంటారు. పోతుంటారు.. కానీ నేర్చుకునే విధానం మాత్రం మారదు. నేర్చుకోవడం ఆగదు.
ఎప్పుడూ కూడా ఓవర్నైట్ రిజల్ట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మా జట్టు యువ క్రికెటర్లతో నిండి ఉంది. మా వాళ్లు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. సత్తాచాటడానికి కొంత సమయమైనా అవసరం. అందుకు ఓపిక పట్టాలి. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మసాలా వార్తలు కావాలి. ప్రతీ ఒక్కరూ, ప్రతీదాంట్లో మసాలా కోరుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశం కోసం కూడా ఆలోచించండి' అని మాలిక్ బదులిచ్చాడు. బంగ్లాదేశ్తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (4 ఫోర్లు, సిక్స్తో 39), మొహమ్మద్ నైమ్ (3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం,షాహిన్ షా, హరీస్ రౌఫ్ తలో వికెట్ తీశారు.