
గొప్ప బ్యాట్స్మెన్..
మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ మాత్రం అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీతో చిరస్మరణీయ విజయాన్నందుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలయమ్సన్ దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. ఇద్దరూ అండర్ 19 కెప్టెన్లుగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ ఒక్క అండర్ 19 టోర్నీలో కేన్ మామపై విరాట్ పైచేయి సాధించాడు.
కానీ ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్లో తలపడ్డ ప్రతీ సారి ఓటమిపాలయ్యాడు. ఇక తనదైన ఆటతో కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్గా ఎదగగా.. మరోవైపు విలియమ్సన్ గొప్ప కెప్టెన్గా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. కోహ్లీ సైతం తన దూకుడైన సారథ్యంతో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. కానీ ఒక్క ఐసీసీ టైటిల్ను నెగ్గలేకపోయాడు. జట్టును ఫైనల్కు తీసుకెళ్లడం.. అక్కడ తుస్సుమనడం.. ఇలా ఓ విఫల కెప్టెన్గా అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

వరుసగా మూడు టోర్నీల్లో..
ఒక మేటి ఆటగాడు గొప్ప కెప్టెన్ కావాలనేమీ లేదు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజానికే కెప్టెన్సీ కలిసి రాలేదు. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో అతను చేసిన పరుగులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయితే జట్టును నడిపించే ఆటగాడిగా మాత్రం కోహ్లీ విఫలమవుతూనే ఉన్నాడు.
ద్వైపాక్షిక సిరీస్ల్లో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నా.. కీలక ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విఫలమవుతున్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, తాజా డబ్ల్యూటీసీ ఫైనల్ వరుసగా మూడు టోర్నీల్లో కోహ్లీకి చుక్కెదురైంది. ఈ మూడు టోర్నీల్లో కోహ్లీ కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మన్గా విఫలమయ్యాడు. అదే భారత విజయవకాశాలను దెబ్బతీసింది.

నాయకుడంటే కేన్..
న్యూజిలాండ్ సారథి కేన్.. 2019 ప్రపంచకప్ ఫైనల్లో అసంబద్దమైన బౌండరీ రూల్తో ఓడినా.. ఎంతో నిబ్బరంగా కనిపించాడు. లక్ ఏ మాత్రం కలిసిరాకున్నా.. అంపైర్లు తప్పిదం చేసినా.. మౌనంగానే ఉంటూ ఆఖరి బంతి వరకు పోరాడాడు. ఫలితం అనుకూలంగా రాకున్నా చిరునవ్వుతోనే ఓటమిని స్వీకరించాడు.
తాజా డబ్ల్యూటీసీ ఫైనల్లో నాయకుడంటే ముందుండి నడిపించేవాడని తనదైన బ్యాటింగ్తో మరోసారి నిరూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 49 పరుగులతో ఓపికగా ఆడి భారత అవకాశాలను అడ్డుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతేకాకుండా మరో సీనియర్ రాస్టేలర్తో కలిసి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ పతనాన్ని శాసించాడు. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ ప్లాన్, పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విలియమ్సన్ తన మార్క్ కెప్టెన్సీ చూపించాడు.

తప్పుకుంటాడా? తప్పిస్తారా?
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి భారత అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. రెండేళ్లుగా ఊరించిన కోహ్లీసేన ఇలా ఫైనల్లో ఊసురుమనిపించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కనీస పోరాటపటిమ కనబర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విజయానికి మాత్రం న్యూజిలాండ్కు అర్హత ఉందంటున్నారు. ఇక ఈ ఓటమితోనైనా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది.
అయితే కెప్టెన్గా కోహ్లీ ఒక్కడే విఫలమవ్వలేదని.. భారత క్రికెట్లో విప్లవం తీసుకొచ్చిన సౌరవ్ గంగూలీ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదని, భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్ ధోనీ.. 2012, 2014, 2016 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్లో ఓడిపోయాడని మరికొంతమంది గుర్తుచేస్తున్నారు. ఈ హాట్ హాట్ డిబేట్ నేపథ్యంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తనకు తానే తప్పుకుంటాడా? లేక తప్పిస్తారా? ముందుకు కొనసాగుతాడా? అనేది కాలమే నిర్ణయించాలి.!


Click it and Unblock the Notifications












