భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్థాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల నేపథ్యంలో ఈ మ్యాచ్ను నిలిపివేసారు. అయితే ఈ మ్యాచ్ రద్దవ్వడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు అత్యవసర సమావేశమయ్యారు. ఐపీఎల్ 2025 నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పాకిస్థాన్ మిస్సైల్స్తో దాడులు చేస్తున్న నేపథ్యంలో టోర్నీని కొనసాగించడం కష్టమని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడం లేదా రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతే ముఖ్యం
ఈ సమావేశానికి ముందు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా.. ఇండియా టుడేతో మాట్లాడారు. పరిస్థితులు అదుపు తప్పడంతోనే పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు చేసినట్లు తెలిపారు. 'ప్రస్తుతం పరిస్థితి బాలేదు. దాంతోనే నేటి మ్యాచ్ను రద్దు చేశాం. ధర్మశాలలోనే కాదు.. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్లు, ప్రేక్షకులు, సపోర్ట్ స్టాఫ్ భద్రత మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఏమైనా చేయడానికి సిద్దం. దేశం కోసం నిలబడుతాం. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. అందుకు తగ్గట్లు టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటాం. 'అని దేవజిత్ సైకియా తెలిపారు.
ఆపరేషన్ సిందూర్..
జమ్మూ కశ్మీర్లో గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పహల్గాంలో భారత స్త్రీల సిందూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'అని ఈ దాడికి నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాక్ మిస్సైల్ను పేల్చేసిన భారత సైన్యం..
పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా ఉండే 18 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం తాత్కలికంగా మూసి వేసింది. ఇందులో ధర్మశాలతో పాటు ఛండీఘడ్, అమృత్ సర్, జమ్మూ, శ్రీనగర్ కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు ప్రయత్నిస్తుంది. మిసైల్లతో దాడికి దిగుతోంది. పాక్ విస్సైల్ను భారత బలగాలు గాల్లోనే పేల్చేసాయి. లాహోర్లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసాయి. పాకిస్థాన్కు చెందిన మూడు యుద్ద విమానాలను భారత్ కూల్చివేసింది.