
సిడ్నీ: భారత్తో టెస్ట్ సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తమ ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతుండగా.. తాజాగా ఆ జాబితాలో యువ ఆటగాడు విల్ పుకోవిస్కీ చేరాడు. భారత్ టెస్ట్ టీమ్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో పుకోవిస్కీ తీవ్రంగా గాయపడ్డాడు. భారత యువ పేసర్ కార్తీక్ త్యాగీ వేసిన బౌన్సర్ నేరుగా పుకోవిస్కీ తలకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు నేలకూలిన పుకోవిస్కీ నొప్పితో విలవిలలాడాడు.
వెంటనే ఫిజియోలు మైదానంలోకి పరుగెత్తుకొచ్చి పరీక్షించారు. గాయం తీవ్రత దృష్ట్యా అతను మైదానం వీడాడు. అప్పటికే అతను 23 పరుగులు చేశాడు. అయితే పుకోవిస్కీ గాయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తీవ్రమైతే మాత్రం అతను టెస్ట్ సిరీస్లోని ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆస్ట్రేలియాతో అప్కమింగ్ టెస్ట్ సిరీస్కు ముందు సన్నాహాకంగా నిర్వహించిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత టెస్ట్ టీమ్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, వృద్దీమాన్ సాహా, మహ్మద్ సిరాజ్లతో పాటు ఆసీస్ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది.
286/8 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 306/9 స్కోర్ వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రిస్ గ్రీన్(202 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 125 నాటౌట్) అజేయంగా నిలిచాడు. సిరాజ్, ఉమేశ్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 61 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయిన వృద్దిమాన్ సాహా(100 బంతుల్లో 7 ఫోర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు.
టీమిండియా నయావాల్ పుజారా(0) డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్లు పృథ్వీ షా(19), శుభ్మన్ గిల్(29) కూడా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నెసర్, క్రిస్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. స్టేక్టీ (5/15) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.