ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన ఘోర పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా అభిమానులను మరో విషయం కలవరపెడుతోంది. ఆసీస్ పర్యటనలో వెన్ను గాయానికి గురైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. అప్కమింగ్ ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడుతాడా? లేదా? అనే విషయం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రాకు వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేయడంతో అతని బ్యాక్పై అధిక లోడ్ పడింది. ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనే అసౌకర్యానికి గురైన బుమ్రా.. వెంటనే ఫిజియోలకు సమాచారమిచ్చాడు.

దాంతో అప్రమత్తమైన బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించారు. బుమ్రా తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసినా.. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. బుమ్రా గైర్హాజరీలో స్వేచ్చగా ఆడిన ఆసీస్ ఆఖరి టెస్ట్ను 6 వికెట్ల తేడాతో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను కూడా దక్కించుకుంది.
ఈ సిరీస్లో టీమిండియా ఓడినా.. బుమ్రా 9 ఇన్నింగ్స్ల్లో 32 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాని, అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. ఆ తర్వాత అతని గాయానికి సంబంధించిన అప్డేట్ ఎవరూ ఇవ్వలేదు. బీసీసీఐ కూడా ఇప్పటి వరకు బుమ్రా ఫిట్నెస్పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
స్కానింగ్ రిపోర్ట్ల్లో ఏం వచ్చింది? బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉందా? మాములు గాయామా? అనే సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి. ఒకవేళ బుమ్రాకు గ్రేడ్ 1 గాయి అయితే అతనికి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు బుమ్రా దూరంగా ఉంటాడు.
నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడు. కానీ గ్రేడ్ 2 గాయం అయితే మాత్రం బుమ్రా కోలుకోవడానికి 6 వారాల నుంచి 3 నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి బుమ్రా దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే టీమిండియాకు ఎదురుదెబ్బే. బుమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రాణించడం చాలా కష్టం. గతంలోనూ బుమ్రా వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే బుమ్రాకు ఏం కాకుడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.