టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య వెస్టిండీస్ దుమ్ము రేపుతోంది. గ్రూప్-సీలో వరుసగా రెండో విజయాన్నందుకుంది. పసికూన ఉగాండాతో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్(42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44), ఆండ్రీ రస్సెల్(17 బంతుల్లో 6 ఫోర్లతో 30 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఉగాండా బౌలర్లలో బ్రియన్ మసబా(2/31) రెండు వికెట్లు తీయగా.. రామ్జనీ, కోస్మాస్, దినేష్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అకీల్ హోస్సేన్(5/11) ఐదు వికెట్లతో ఉగాండా పతనాన్న శాసించాడు. అల్జారీ జోసెఫ్(2/6) రెండు వికెట్లు తీయగా.. రోమారియో షెఫర్డ్, గుడకేష్ మోతీ, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ గెలుపుతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ విజయాన్ని నమోదు చేసిన రెండో జట్టుగా వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ కన్నా ముందు శ్రీలంక 172 పరుగుల భారీ తేడాతో గెలిచి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2007 టీ20 ప్రపంచకప్లో శ్రీలంక 172 పరుగుల తేడాతో కెన్యాను ఓడించింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా కొనసాగుతోంది. రెండో స్థానంలో వెస్టిండీస్ తాజా విజయం(134 పరుగుల భారీ తేడాతో) నిలిచింది.
ఈ క్రమంలో వెస్టిండీస్ అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికాలను అధిగమించింది. 2021 టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ స్కాంట్లాండ్పై 130 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా ప్రపంచకప్లో అఫ్గాన్ ఉగాండాపై 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2009 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా 130 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది.