ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సూపర్-8 పోరులో వెస్టిండీస్ 177 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జాసన్ హోల్డర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), రొమారియో షెఫర్డ్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) 89 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/30) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, కార్బిన్ బోష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ అదే జోరులో వరుసగా వికెట్లు కోల్పోయింది. రబడా వేసిన మూడో ఓవర్లోనే కెప్టెన్ షై హోప్(16), డేంజరస్ హెట్మైర్(2) క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. బ్రాండన్ కింగ్(21), రోస్టన్ ఛేజ్(2)ను లుంగిడి ఎంగిడి ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో వెస్టిండీస్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా విండీస్ వికెట్ల పతనం కొనసాగింది.

షెర్ఫెన్ రూథర్ఫోర్డ్(12), మాథ్యూ ఫోర్డ్(11)లను బోష్ ఔట్ చేయగా.. రోవ్మన్ పోవెల్(9)ను ఎంగిడి పెవిలియన్ చేర్చాడు. దాంతో వెస్టిండీస్ 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో జాసన్ హోల్డర్, రొమారియో షెఫెర్డ్ జట్టును ఆదుకున్నారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దాంతో సౌతాఫ్రికా 176 పరుగులు చేయగలిగింది. ఎంగిడి, బోష్ చివరి రెండు ఓవర్లు కట్టడిగా వేసారు. లేదంటే విండీస్ 200 పరుగుల స్కోర్ చేసేది.
ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్ చూసి భారత అభిమానులు సంతోషానికి గురయ్యారు. విండీస్ తక్కువ పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలవుతుందని భావించారు. కానీ హోల్డర్, షెఫర్డ్ అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించి భారత అభిమానుల ఆశలను చిదిమేసారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధిస్తే.. టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. తదుపరి రెండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే సరిపోతుంది. ఎలాంటి రన్రేట్ లెక్కలు అవసరం లేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ఓడిపోవాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.