
సెయింట్ జార్జ్: ఇంగ్లండ్ టెయిలెండర్లు జాక్ లీచ్(141 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్), సాకిబ్ మహమూద్(118 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49)చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్లో అసాధారణ బ్యాటింగ్తో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. చెత్త బ్యాటింగ్తో 114 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును అద్భుతమైన బ్యాటింగ్తో ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ కట్ట కట్టుకొని విఫలమైన వేళ.. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అసాధారణ బ్యాటింగ్ చేశారు. వారి సహనానికి పరీక్షగా నిలుస్తూ చివరి వికెట్కు 90 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టుకు 204 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు.
ఫలితంగా 145 ఏళ్ల రికార్డును అధిగమించారు. ఇలా 10వ, 11వ బ్యాట్స్మన్ ఆఖరి వికెట్కు ఇన్ని పరుగుల భాగస్వామ్యం అందించడం ఇదే తొలిసారి. అప్పుడెప్పుడో.. 1885లో ఇదే ఇంగ్లండ్కు చెందిన టామ్ గారెట్, ఎడ్విన్ ఎవన్స్లు సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టులో ఆఖరి వికెట్కు 81 పరుగులు జోడించడమే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జాక్ లీచ్, సాకిబ్ మహమూద్లు బద్దలు కొట్టారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటైంది. జాక్ లీచ్, సాకిబ్ మహమూద్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. జాక్ క్రాలీ(7), జోరూట్(0), డాన్ లారెన్స్(8), బెన్ స్టోక్స్(2), జానీ బెయిర్ స్టో(0), బెన్ ఫోక్స్(7), దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ మూడు, కీమర్ రోచ్, కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్లు తలా రెండు వికెట్లు తీశారు. బ్లాక్ వుడ్కు ఓ వికెట్ దక్కింది.