క్రికెట్ చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఒకే జట్టుకు చెందిన బౌలర్, కెప్టెన్ గొడవపడ్డారు. కెప్టెన్పై ఆగ్రహంతో మ్యాచ్ మధ్యలోనే బౌలర్ మైదానం వీడాడు. ఈ విచిత్రకర ఘటనకు వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డే వేదికైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డ్ సెటప్పై ఆ జట్టు స్టార్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్ సెటప్ విషయంలో కెప్టెన్ తన మాట వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అల్జారీ జోసెఫ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ ప్రారంభానికి ముందే అల్జారీ జోసెఫ్ సూచించిన ఫీల్డ్ సెటప్ కాకుండా కెప్టెన్ షై హోప్ మరోలా ఫీల్డ్ సెట్ చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అల్జారీ జోసెఫ్.. ఆ కోపాన్ని బంతిపై చూపించాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని బౌన్సర్గా సంధించి ఇంగ్లండ్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్(1)ను కీపర్గా పెవిలియన్ చేర్చాడు. ఔట్ చేసిన తర్వాత కూడా కెప్టెన్ షై హోప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత మరో రెండు బంతులేసి ఓవర్ పూర్తి చేశాడు. ఆ వెంటనే కెప్టెన్పై అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. కాసేపు డ్రెస్సింగ్ రూమ్లోనే కూర్చున్నాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ వచ్చి అల్జారీ జోసెఫ్తో మాట్లాడి అతనికి సర్థి చెప్పగా.. అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. అల్జారీ జోసెఫ్ మైదానం వీడటంపై కామెంటేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో కెప్టెన్కు మర్యాద ఇవ్వాలని, ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగులే చేసింది. ఫిల్ సాల్ట్(108 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 74), డాన్ మౌస్లీ(70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో జోఫ్రా ఆర్చర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే(3/35) మూడు వికెట్లు తీయగా.. రోమారియో షెఫర్డ్(2/33), అల్జారీ జోసెఫ్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు. రోస్టన్ చేజ్(1/42) ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 43 ఓవర్లలోనే 2 వికెట్లకు 267 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బ్రాండన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 102), కీసీ కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 128 నాటౌట్) సెంచరీలతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ, జామీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు. స్టన్నింగ్ క్యాచ్తో పాటు సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Alzarri Joseph left the pitch in anger because he wasn't happy with the captain's field setting. Unreal 🤣 pic.twitter.com/RoQCLMEV7A
— R A T N I S H (@LoyalSachinFan) November 7, 2024