
షార్జా: టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతిలో చిత్తయిన ఆ జట్టు.. బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో అద్భుత విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్.. 3 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(39), నికోలస్ పూరన్(40), జాసన్ హోల్డర్(15 నాటౌట్), కీరన్ పొలార్డ్(14 నాటౌట్) మెరుపులు మెరిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహెదీ హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లిటన్ దాస్(44), కెప్టెన్ మహ్మదుల్లా(31 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో రవి రాంపాల్, జాసన్ హోల్డర్, ఆండ్రీ రస్సెల్, అకీల్ హోస్సెన్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీశారు. ఇక బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమవ్వగా.. ఆండ్రీ రస్సెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 9 పరుగులే ఇచ్చాడు. బంగ్లా విజయానికి చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమవ్వగా.. రస్సెల్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దాంతో విండీస్ విజయం లాంఛనమైంది.
అంతకు ముందు బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4) ఘోరంగా విఫలమయ్యారు. మూడో ఓవర్లో లూయిస్ క్యాచ్ ఔట్ కాగా.. ఐదో ఓవర్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సరికి వెస్టిండీస్ స్కోరు 29/2గా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన షిమ్రోన్ హెట్ మైర్ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆండ్రూ రస్సెల్ (0), డ్వేన్ బ్రావో (1) కూడా రాణించలేదు. తర్వాత వచ్చిన రోస్టన్ ఛేజ్, నికోలస్ పూరన్ ధాటిగా ఆడారు. అయితే, వీరిద్దరినీ షొరిఫుల్ ఇస్లామ్ 19వ ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి డ్వేన్ బ్రావో (1) సౌమ్యసర్కార్కి చిక్కాడు. తర్వాత జేసన్ హోల్డర్ (15 ) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. చివరి బంతికి పొలార్డ్ (14) సిక్స్ బాదాడు. హోల్డర్, పొలార్డ్ నాటౌట్గా నిలిచారు.