
గుయానా: అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. గత కొన్నేళ్లుగా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అగ్ర దేశాలను ఓడించింది. ఇప్పుడు వెస్టిండీస్ గడ్డపై సిరీస్ గెలిచి తాము పసికూనలం కాదని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.
బుధవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్(25- నాటౌట్) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ నికోలస్ పూరన్ డకౌట్గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ శుభారంభం అందించాడు.
అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్ దాస్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. నాసుమ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.