వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. బ్రిడ్జ్టౌన్ వేదికగా శుక్రవారం ముగిసిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 141 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసెఫ్ టాప్ స్కోరర్గా నిలవగా.. జస్టిన్ గ్రీవ్స్(38), జాన్ క్యాంప్బెల్(23), కీసే కార్టీ(20) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.
మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(5/43) ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. నాథన్ లయన్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. 10 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్(61), బ్యూ వెబ్స్టర్(63), అలెక్స్ క్యారీ(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. షమర్ జోసెఫ్(5/87) ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్.. జూలై 3 నుంచి ప్రారంభం కానుంది.