సొంతగడ్డపై వెస్టిండీస్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు టెస్ట్ల సిరీస్లో 3-0తో క్లీన్ స్వీప్ అయిన వెస్టిండీస్.. ఐదు టీ20ల సిరీస్లోనూ శుభారంభం చేయలేకపోయింది. కింగ్స్టన్ వేదికగా ఆదివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్(39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 55), రోస్టన్ ఛేజ్(32 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు.
షిమ్రన్ హెట్మైర్(19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38) దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(4/36) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సీన్ అబాట్, కూపర్ కొన్నోల్లీ, నాథన్ ఎల్లిస్, మిచెల్ ఓన్ తలో వికెట్ తీసారు. లోయరార్డర్ వైఫల్యం వెస్టిండీస్ కొంపముంచింది. బెన్ ద్వార్షుయిస్ వేసిన 19వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్(8), షెర్ఫన్ రూథర్ ఫోర్(0), జాసన్ హోల్డర్(0) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. దాంతో వెస్టిండీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

అనంతరం ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కామెరూన్ గ్రీన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 51), మిచెల్ ఓవెన్(27 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/32), అల్జారీ జోసెఫ్(2/39), గుడకేష్ మోతీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం జరగనుంది.