మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. నవీ ముంబైలోని డివీ పాటిల్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తలపడనున్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజయం తర్వాత ఈ టోర్నీ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఈ లీగ్ ప్రారంభమైన తర్వాత ఈ సారే మెగా వేలం జరగ్గా ఆటగాళ్లంతా జట్లలో తారుమారయ్యారు. ఇది అభిమానుల్లో ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తోంది.
మెగా వేలం జరిగినా.. గత మూడు సీజన్ల తరహాలోనే కార్వాన్ ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 23 మ్యాచ్లు రెండు మ్యాచ్లు రెండు వేదికల్లోనే జరగనున్నాయి. ఐపీఎల్ తరహాలో హోమ్ అండ్ అవే ఫార్మాట్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం లేదు.

అరంగేట్ర డబ్ల్యూపీఎల్ 2023 సీజన్ కూడా కార్వాన్ ఫార్మాట్లోనే నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించింది. ఐపీఎల్ తరహాలో హోమ్ అండ్ అవే ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించకపోవడానికి గల కారణం అధికారికంగా తెలియనప్పటికీ.. టోర్నీని త్వరగా ముగించాలనే యోచనలో ఇలా చేస్తున్నట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా టోర్నీలో కేవలం 5 జట్లు మాత్రమే తలపడుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది. మ్యాచ్ల మధ్య ఎక్కువ సమయం లేకపోవడం.. ప్రయాణాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ ఫార్మాట్ ఎంచుకున్నట్లు అర్థమవుతుంది.
మరిన్ని జట్లతో డబ్ల్యూపీఎల్ను విస్తరించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అతి త్వరలోనే మరో 2-3 జట్లు ఈ లీగ్లో భాగమవుతాయని ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ పార్త్ జిందాల్ మీడియాకు తెలిపారు. 'డబ్ల్యూపీఎల్ను హోమ్ అండ్ అవే ఫార్మాట్లో నిర్వహిస్తే చూడాలని ఉంది. బీసీసీఐ ఆ దిశగా పనిచేస్తుందని ఆశిస్తున్నా. అతి త్వరలోనే డబ్ల్యూపీఎల్ టీమ్స్ సంఖ్య పెరగడంతో పాటు సుదీర్ఘ విండో కూడా లభిస్తుందని అనుకుంటున్నా. కొత్త జట్ల చేరిక తర్వాతే హోమ్ అండ్ అవే ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతాయని అనుకుంటున్నా.'అని డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం సందర్భంగా పార్త్ జిందాల్ అభిప్రాయపడ్డాడు.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్కు నవీ ముంబై, వడోదర కోటంబి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవీ ముంబై వేదికగా 11 మ్యాచ్లు.. వడోదర స్టేడియంలో ఫైనల్తో సహా మిగిలిన 11మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో ఒక్కో జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్ల చొప్పున మొత్తం 8 మ్యాచ్లు ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసే సరికి అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడో స్థానంలో నిలిచిన మ్యాచ్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
డబ్ల్యూపీఎల్ 2023, 2024 సీజన్లో కూడా రెండు వేదికల్లోనే మ్యాచ్లు నిర్వహించారు. నవీ ముంబై, ముంబై సీసీఐ గ్రౌండ్లో తొలి సీజన్ మ్యాచ్లు జరిగాయి. ఢిల్లీ, బెంగళూరు వేదికగా రెండో సీజన్ మ్యాచ్లు నిర్వహించారు. గత డబ్ల్యూపీఎల్ 2025 సీజన్లో మాత్రం వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై సీసీఐ మైదానాలు ఆతిథ్యం ఇచ్చాయి.