|
మూడేళ్ల వయసులో..
'కోహ్లీ మూడేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. చుట్టుపక్కలవారి సలహాలతో 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. సురేశ్ బాత్ర కొచింగ్ పర్యవేక్షణలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. 2002లో ఢిల్లీ అండర్-15 తరఫున బరిలోకి దిగాడు. పోలీ ఉమిగర్ ట్రోఫీలో 34.40 సగటుతో 72 రన్స్ చేశాడు. ఆ మరుసటి ఏడాదే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి 5 ఇన్నింగ్స్ల్లో 390 రన్స్ చేశాడు.
కెప్టెన్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 టీమ్లో చోటు దక్కించుకున్నాడు. ఆ పర్యటనలో అద్భుతంగా రాణించి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ సమయంలోనే కోహ్లీ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించాడు. అయినా అతను కర్ణాటకతో మ్యాచ్ను డ్రా చేసే ఇంటికి చేరాడు.
అండర్-19 ప్రపంచకప్తో..
అండర్ 19 ప్రపంచకప్ సాధించి 2008 శ్రీలంకతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 20 ఏళ్ల వయసులోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డే జట్టులో నిలకడగా రాణిస్తూ టెస్ట్ టీమ్లోకి అడుగుపెట్టాడు. కెరీర్ అద్భుతంగా సాగుతుండగా.. 2014 ఇంగ్లండ్ పర్యటన అతనికి ఓ పీడకలను మిగిల్చింది.
ఆ టూర్లో 10 ఇన్నింగ్స్ల్లో 134 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత విరాట్ పూర్తిగా మారిపోయాడు. ఫిట్ నెస్ ఫ్రీక్గా మారి ఓ కొత్త కోహ్లీని తలపించాడు. ఆస్ట్రేలియా 2014/15 పర్యటనలో నాలుగు సెంచరీలతో 692 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అదే ఏడాది ధోనీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లీ టీమిండియా సారథిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు.
కీబోర్డు వారియర్స్ మాత్రం..
కానీ చాలా మంది హేటర్స్, కీబోర్డు వారియర్స్ విరాట్ కోహ్లీని చోకర్ అంటారు. కీలక మ్యాచ్ల్లో ఆడడని చెబుతుంటారు. కానీ నాకౌట్స్లో 57 సగటు, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ కోహ్లీ అనే విషయాన్ని వారు గుర్తించరు. భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన కోహ్లీకి కెప్టెన్సీ రాదంటారు. అతని సారథ్యంలో భారత్ 59 శాతం విజయాలందుకుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై ఓడించింది. కానీ ఓ రెండు మ్యాచ్లు ఓడిపోతే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తారు.
70 సెంచరీలు.. 20కే రన్స్..
ఓ దశాబ్దంలో 70 అంతర్జాతీయ సెంచరీలతో పాటు 54.5 సగటుతో 20 వేల రన్స్ చేసిన బ్యాట్స్మన్ను ఓవర్ రేటేడ్(స్థాయికి మించిన గుర్తింపు) ప్లేయరంటూ విమర్శిస్తారు. వ్యక్తిగతం కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడుతున్నందుకు, సెంచరీల కన్నా జట్టు విజయాలనే ఎక్కువ సంతోషిస్తానని చెప్పినందుకు విరాట్ను అసహ్యించుకుంటున్నారు. హేటర్స్ కోహ్లీపై ఎన్ని విమర్శలు చేసినా? మేం మాత్రం ఎప్పటికీ అతనికి అండగా ఉంటాం. కష్ట సమయాల్లో కూడా తోడుగా నిలుస్తాం'అని సదరు అభిమాని రాసుకొచ్చాడు.