
న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన 8 మంది భారత యువ ఆటగాళ్లకు ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో అవకాశం దక్కలేదు. ఈ ధనాధన్ లీగ్ కోసం 1214 మంది ప్లేయర్లు ఆసక్తికనబర్చగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో అండర్ వరల్డ్ కప్ చాంపియన్స్కు చోటు దక్కలేదు. తెలుగు తేజం 17 ఏళ్ల షేక్ రషీద్తో పాటు 8 మంది ఈ జాబితా నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఐపీఎల్ లీగ్ నిబంధనల ప్రకారమే ఈ 8 మంది ఆటగాళ్లను మెగా వేలం షార్ట్ లిస్ట్ నుంచి తొలిగించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనే ఆటగాళ్లు 19 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. అండర్ 19 ఆటగాళ్లు అయితే ఆయా రాష్ట్రాల జట్ల తరఫున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ, లిస్ట్ ఏ గేమ్ కానీ ఆడి ఉండాలి. అయితే షేక్ రషీద్తో పాటు హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ బానా, అంగ్క్రిష్ రఘు వంశీ, మనవ్ పరాక్, నిషాంత్ సింధు, గ్రావ్ సంగ్వాన్, రవి కుమార్, సిద్ధార్థ్ యాదవ్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్తో పాటు లిస్ట్ ఏ గేమ్ ఆడలేదు. దాంతో వారు మెగావేలం షార్ట్ లిస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
ఇక కరోనా కారణంగా దేశవాళీ అండర్ 19 క్రికెట్ టోర్నీలతో పాటు సీనియర్ లెవల్ టోర్నీలు వాయిదా పడటంతో చాలా మంది యువ ఆటగాళ్లు లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ 8 ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని, నిబంధనలను మార్చి ఈ టాలెంటెడ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.
'ఈ అసంబద్దమైన కారణంగా ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఐపీఎల్ కాంట్రాక్టులు కోల్పోవడం బాలేదు. బీసీసీఐ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేయాలని. ఐపీఎల్ మెగావేలంలో ఈ యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని'బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ షెట్టీ అభిప్రాయపడ్డాడు. ఈ 8 ఆటగాళ్లకు మెగా వేలంలో అవకాశం కల్పిస్తే.. ఇందులో చాలా మందికి మంచి కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా ఐదో సారి విశ్వవిజేతగా నిలిచింది.