ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇప్పటికే జట్టులోని ప్రధాన ఆటగాళ్లు భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్లు ఆడారు. శుక్రవారం నుంచి భారత్, భారత్-ఏ జట్ల మధ్య సన్నాహక మ్యాచ్ జరగనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను పూర్తీగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షించనున్నాడు. తుది జట్టు ఎంపికతో పాటు ఇంగ్లండ్ కండిషన్స్కు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ను ఉపయోగించుకోనున్నారు.
అయితే ఈ మ్యాచ్కు ప్రత్యక్ష ప్రసారం లేదు. మీడియాను కూడా అనుమతించడం లేదు. క్లోజ్ డోర్స్ మధ్య ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. స్థానిక అభిమానులను కూడా అనుమతించరు. జట్టు వ్యూహాలు గోప్యంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇలానే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్కు ఫస్ట్-క్లాస్ స్టేటస్ లేదు. ఇది కేవలం ఒక ప్రాక్టీస్ గేమ్ మాత్రమే. ఇందులో చేసే పరుగులు, తీసిన వికెట్లు ఆటగాళ్ల ఫస్ట్-క్లాస్ రికార్డుల్లో చేరవు.

భారత్-ఏ, భారత జట్లలోని ఆటగాళ్లు రెండు టీమ్స్గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడుతారు. నాలుగు రోజుల పాటు 360 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. ప్రతీ ఒక్కరు బ్యాటింగ్ చేసేలా.. బౌలింగ్ చేసేలా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. టెస్ట్ క్రికెట్కు అవసరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.
నేటి(జూన్ 13) నుంచి జూన్ 16 వరకు బెకన్హామ్లోని కెంట్ కౌంటీ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది జట్టు ఎంపిక విషయంలో ఉన్న సందేహాలను ఈ మ్యాచ్ ద్వారా తీర్చుకోనున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్-రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి-శార్దూల్ ఠాకూర్లో ఎవర్నీ ఆడించాలనే అంశాలపై ఈ మ్యాచ్ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు తరఫున ఓ ఆటగాడు,లేదా సపోర్ట్ స్టాఫ్ మెంబర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించిన వివాలను పంచుకోవచ్చు. ఓవరాల్గా ఇది నాలుగు రోజుల పాటు ఫస్ట్ క్లాస్ స్టేటస్ లేని, గోప్యంగా ఆడే ఒక పూర్తి స్థాయి టెస్ట్ మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ గేమ్ మాత్రమే.