
హైదరాబాద్: 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఆడేందుకు సుముఖంగా ఉన్న టీమిండియా వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్కు నిరాశే ఎదురుకానుంది. శని, ఆది వారాల్లో(ఫిబ్రవరి 12, 13) బెంగళూరు వేదికగా జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఈ కేరళ స్పీడ్స్టార్కు అవకాశం దక్కినా.. ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చే అవకాశం లేదు. బీసీసీఐ షార్ట్లిస్ట్లో చోటు దక్కించుకున్న శ్రీశాంత్ను ఫ్రాంచైజీలు కనుకరించడం కష్టంగా మారింది.
బీసీసీఐ నిషేధం కారణంగా 9 ఏళ్లు క్రికెట్కు దూరంగా ఉండటం, వయసు పై బడటం, మునపటిలా బౌలింగ్ చేయకపోవడం వంటి కారణాలతో శ్రీశాంత్పై ఫ్రాంచైజీలు అయిష్టతను కనబరుస్తున్నాయి. కేరళ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా.. టీమ్ భవిష్యత్తు దృష్ట్యా అతని తీసుకొని రిస్క్ చేయడం అనవసరమనే ఆలోచనలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ కారణంగానే అతను అన్సోల్డ్ లిస్ట్లో చేరే అవకాశం ఉంది. రూ. 50 లక్షల కనీస ధరతోనే అందుబాటులో ఉన్నప్పటికీ.. టీమ్స్ పెద్దగా ఆసక్తికనబర్చడం లేదు. అయితే శ్రీశాంత్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ జట్టు అయినా తీసుకోవాలనుకుంటే కనీస ధరకు కొనుగోలు చేయవచ్చు.
టూ టైమ్ వరల్డ్ కప్ విన్నర్ అయిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. దీనిపై సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతని నిషేధాన్ని సమర్థించింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
అక్కడ ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో 2020 సెప్టెంబర్తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. దేశంలోనే మేటీ స్వింగ్ బౌలర్ అయిన శ్రీశాంత్ కేరళ జట్టులో చేరి ముస్తాక్ అలీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గతేడాదే శ్రీశాంత్ ఐపీఎల్ ఆడాలని భావించాడు. కానీ ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చకపోవడంతో అతను షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ సారి చోటు దక్కించుకున్నా.. ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం లేదు.