టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. డిసెంబర్ 14 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్.. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీతో మైదానంలోకి అడుగుపెడుతాడని వార్తలు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం సిక్కింతో జరిగే మ్యాచ్లో పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్ బరిలోకి దిగాల్సి ఉంది. శుభ్మన్ గిల్ రీఎంట్రీతో జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
గిల్ పాపులారిటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ తీరా ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ బరిలోకి దిగలేదు. టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగినా.. ఈ మ్యాచ్కు గిల్ దూరంగా ఉన్నాడు. చివరి నిమిషంలో శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు దూరం అయినట్లు తెలుస్తోంది. సరిగ్గా మ్యాచ్ జరిగే సమయానికి గిల్ ఫుడ్పాయిజన్తో బాధపడ్డాడని, లూజ్ మోషన్స్ కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని ఓ జాతీయ మీడియా పేర్కొంది. దాంతో శుభ్మన్ గిల్ పునరాగమనం ఆలస్యమైందని తెలిపింది.

శుభ్మన్ గిల్ గైర్మాజరీకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కానీ, ఇటు బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మంగళవారం(జనవరి 6) జరిగే పంజాబ్ వర్సెస్ గోవా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో గిల్ బరిలోకి దిగనున్నాడు. పేలవ ఫామ్తో భారత టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్తో తలపడే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగి ఫామ్ అందుకోవాలని గిల్ భావించాడు.
ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా సి క్కింతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం 22.2 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. అర్ష్దీప్ సింగ్(5/34) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం పంజాబ్ 6.2 ఓవర్లలోనే 81 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టును ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపాడు. 'జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రోజు మేం సెలెక్టర్లతో మధ్యాహ్నం సమావేశం అవుతున్నాం. ఆ సమావేశం అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటిస్తాం.'అని సైకియా పేర్కొన్నారు.