ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తీవ్ర నొప్పితో బ్యాటింగ్ చేశాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. రక్త స్రావం కావడంతో పాటు పాదం వాచిపోయింది. దాంతో నేల మీద పాదం పెట్టేందుకు రిషభ్ పంత్ అల్లాడిపోయాడు. గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సాయంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు.
అతను మళ్లీ బ్యాటింగ్ చేయడం కష్టమేనని అంతా భావించారు. కుడి కాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ పంత్ మాత్రం బ్యాటింగ్ దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌండరీ బాది 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుంటుతూనే బ్యాటింగ్ చేసిన పంత్.. సింగిల్స్, డబుల్స్ తీయకుండా కేవలం భారీ షాట్స్కే పరిమితమయ్యాడు.

తీవ్ర గాయమైన రిషభ్ పంత్కు కనీసం బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పించారు. అయితే క్రికెట్లో బై రన్నర్ రూల్ను ఐసీసీ ఏత్తేసింది. ఈ రూల్ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో 2011 అక్టోబర్ 1న ఈ రూల్ను ఐసీసీ రద్దు చేసింది. దాంతోనే పంత్ బై రన్నర్ లేకుండా బ్యాటింగ్ చేశాడు. అవసరం లేకున్నా బై రన్నర్స్ను ఉపయోగిస్తుండటంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. బై రన్నర్ రూల్ను రద్దు చేయకుండా కఠినతరం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పరుగెత్తలేని పరిస్థితి ఉన్నప్పుడే బై రన్నర్ను అనుమతించేలా రూల్ను మార్చాల్సిందని కామెంట్ చేస్తున్నారు.
బై రన్నర్ను పూర్తిగా తీసేయడం వల్ల తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లు రిస్క్ చేసి బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని పోస్ట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా బై రన్నర్ రూల్ విషయంలో పునరాలోచన చేయాలని ఐసీసీకి సూచిస్తున్నారు.
కంకషన్ సబ్స్టిట్యూషన్కు అవకాశం ఇచ్చిన ఐసీసీ.. ఇంజ్యూరీ రిప్లేస్మెంట్కు కూడా అవకాశం ఇచ్చేలా రూల్స్ను మార్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ ప్రకారం.. ఆటగాడి తలకు తీవ్ర గాయమైతే అతని స్థానంతో అదే తరహా ఆటగాడిని ఆడించవచ్చు. సదరు ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయవచ్చు. ఇదే తరహాలో తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లకు రిప్లేస్మెంట్కు అనుమతించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ డిమాండ్ చేశాడు. పంత్ లాంటి స్పష్టమైన గాయాలైన ఘటనల్లో సబ్స్టిట్యూట్లను అనుమతించేలా ఐసీసీ నిబంధనలను మార్చాలని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఇది ఆట సమతుల్యతతో పాటు ఆటగాడి భద్రతకు అవసరమని అభిప్రాయపడ్డాడు.