IPL: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్ర సీజన్ వేలంలో ధోనీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముంబై ఇండియన్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే చివరకు సీఎస్కే ధోనీని సొంతం చేసుకుంది. గత 15 సీజన్లుగా చెన్నైకే ఆడుతున్న ధోనీ.. ఆ జట్టును ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు.
ఐపీఎల్ 2008 వేలంలో ధోనీ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అప్పుడు అతను దాదాపు రూ.6 కోట్లు పలికాడు. అయితే విచిత్రకర పరిస్థితుల్లో ధోనీని ఆర్సీబీ తీసుకోలేకపోయిందని అప్పటి ఆక్షనీర్ రిచర్డ్ మ్యాడ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

'అప్పటికీ ఆర్సీబీ ఇంకా తమ ఫ్రాంచైజీ పేరు ఖరారు చేసుకోలేదు. బెంగళూరు పేరుతోనే వేలం ప్యాడ్ను ప్రదర్శించింది. అయితే బిడ్డింగ్ రూల్స్ ప్రకారం ఆ జట్టు వెనుకడుగు వేయాల్సి వచ్చింది.'అని చెప్పుకొచ్చాడు.
టీమ్ ఐకాన్ ప్లేయర్ కంటే ఎక్కువ ఫీజు మరే ఆటగాడికి ఉండొద్దనే నిబంధన కారణంగా ఆర్సీబీ వెనుకడుగువేయాల్సి వచ్చింది. ఆర్సీబీ అప్పటికే రాహుల్ ద్రవిడ్ను తమ ఐకానిక్ ప్లేయర్గా ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ కూడా ఇదే కారణంతో ధోనీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ జట్టు సచిన్ టెండూల్కర్ను తమ ఐకానిక్ ప్లేయర్గా ఎంచుకుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఐకానిక్ ప్లేయర్ లేకపోవడంతో భారీ ధర చెల్లించి ధోనీని తీసుకుంది. ధోనీని వదులుకోవడం ఆర్సీబీకి తీరని నష్టం చేసింది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేపోయింది. ముంబై ఇండియన్స్ మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలో ఐదు టైటిళ్లు గెలిచింది.
అయితే అప్పటి ఆర్సీబీ సీఈఓ చారు శర్మ మాత్రం విచిత్ర కారణాన్ని వెల్లడించాడు. ధోనీకి భారీ ధర చెల్లించిన తర్వాత అతను విఫలమైతే పరిస్థితి ఏందని భయపడే తీసుకోలేదని చెప్పాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధర చెల్లించి ధోనీని తీసుకుంది. అతను విఫలమైతే పరిస్థితి ఏంది? ధోనీ కోసం పోటీ ఎలా ఉంటుందో మాకు ముందే తెలుసు.
ఇదేం వన్ మ్యాన్ షో కాదు. ఇది టీమ్ గేమ్. ఉదాహరణకు ధోనీ కొన్ని మ్యాచ్ల్లో డకౌట్ అయినా.. దారుణంగా విఫలమైనా చెన్నై అభిమానులే అతనికి అంత ధర అవసరమా? అని ప్రశ్నిస్తారు.'అని అప్పట్లో చారు శర్మ చెప్పుకొచ్చాడు.