టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ జట్టు వివరాలను ఇంకా వెల్లడించలేదు. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలను ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మే1ని డెడ్లైన్గా విధించింది.
ఈ క్రమంలోనే భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రధాన జట్లతో పాటు అనామక జట్లు కూడా తమ ప్రపంచకప్ స్వ్కాడ్స్ వివరాలను వెల్లడించాయి.

వరల్ట్ కప్ టెక్నికల్ కమిటీ అనుమతి లేకుండా జట్టులోని మార్పులు చేసేందుకు మే 24 వరకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏదైనా మార్పులు చేయాలనుకుంటే వరల్డ్ కప్ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
జట్టును ప్రకటించేందుకు గడువు సమీపిస్తున్నా పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించలేదు. తమ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటంతోనే ప్రపంచకప్ జట్టు ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుందని పీసీబీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
మహమ్మద్ రిజ్వాన్, ఆజామ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హారిస్ రౌఫ్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతోనే ప్రపంచకప్ ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ల్లో వారి వ్యక్తిగత ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ప్రపంచకప్కు ఎంపిక చేయాలని పాకిస్థాన్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే పాకిస్థాన్ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించనున్నారు. 'పాకిస్థాన్ జట్టు ప్రకటన ఆలస్యం కావడం పెద్ద విషయమే కాదు. 24 మే వరకు ఎలాంటి అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ఆ తర్వాతే టెక్నికల్ కమిటీ అనుమతితో జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుంది.
గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే రిప్లేస్మెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోనే పీసీబీ.. పాకిస్థాన్ జట్టు ప్రకటనను వాయిదా వేసింది. ఇంగ్లండ్తో తొలి టీ20 జరిగే వరకు ప్రపంచకప్ జట్టు ఎంపికను హోల్డ్లో పెట్టనున్నారు.'అని పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది.