భారత అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ ధనాధన్ లీగ్ జరగనుంది. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచ్లు.. అభిమానుల్ని అలరించనున్నాయి. ఐకానిక్ ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ సీజన్కు తెరలేవనుంది.
ముంబైతో ఆర్సీబీ, సీఎస్కేకు ఒక్కో మ్యాచే..
అయితే ఈ షెడ్యూల్ ప్రకారం కొన్ని జట్ల మధ్య రెండేసి మ్యాచ్లు జరగనుండగా.. మరికొన్ని జట్ల మధ్య ఒక్కో లీగ్ మ్యాచ్ మాత్రమే జరగనుంది. ముఖ్యంగా అత్యంత అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఒక్కో మ్యాచ్ మాత్రమే జరగనుండటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ, సీఎస్కేలు కూడా ఒక్కోసారి మాత్రమే తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు కూడా సన్రైజర్స్ హోమ్ గ్రౌండ్లో కాకుండా ప్రత్యర్థి టీమ్లో ఉండటం అభిమానులకు మింగుడు పడటం లేదు. తమ అభిమాన ఆటగాళ్లు అయిన ధోనీ, కోహ్లీలను చూడలేమా? అని హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

సీడింగ్ ర్యాంక్స్తో రెండు గ్రూప్స్..
అసలు ఎందుకు ఇలా కొన్ని జట్ల మధ్యే ఒక్కో మ్యాచ్.. మరికొన్ని జట్ల మధ్య రెండు మ్యాచ్లను షెడ్యూల్ చేశారనేది తెలుసుకుందాం. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వచ్చి చేరడంతో ఇలా చేయాల్సి వచ్చింది. 74 మ్యాచ్లను డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో బీసీసీఐ నిర్వహిస్తోంది. ఇందు కోసం 10 జట్లను బీసీసీఐ రెండు గ్రూపులుగా విభజించింది. ఐపీఎల్ టైటిళ్ల సంఖ్య, ఎన్నిసార్లు ఫైనల్కు చేరిందనే విషయం ఆధారంగా 10 జట్లకు సీడింగ్ ర్యాంకుల కేటాయించి రెండు గ్రూపులుగా విభజించారు.
వేర్వేరు గ్రూప్స్లో ముంబై, ఆర్సీబీ..
గ్రూప్-ఏలో సీఎస్కే, కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఉండగా.. గ్రూప్-బీలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. తమ గ్రూప్లో ఉన్న ప్రత్యర్థి జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడనుండగా.. ప్రత్యర్థి గ్రూప్లోని టీమ్స్తో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. ప్రత్యర్థి గ్రూప్లో తమకు సమంగా ఉన్న ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్లు ఆడుతాయి. ఈ క్రమంలోనే గ్రూప్-ఏలో ఉన్న ఆర్సీబీ, సీఎస్కే.. ప్రత్యర్థి గ్రూప్లోని ముంబై ఇండియన్స్ ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి.