ప్రతీష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ ఫేజ్ బుధవారం ప్రారంభమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నయా రూల్తో ఇంటర్నేషనల్ స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు.
అతనితో పాటు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్ రంజీ మ్యాచ్ ఆడారు. మెడ నొప్పితో విరాట్ కోహ్లీ.. రంజీ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా కూడా రంజీ ట్రోఫీ ఆడటం లేదు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోని టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ మాత్రం రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడలేదు. హైదరాబాద్ తరఫున అతను ఆడాల్సి ఉన్నా.. బుధవారం హిమాచల్ ప్రదేశ్తో ప్రారంభమైన మ్యాచ్లో బరిలోకి దిగలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో చోటు కోల్పోయిన అనంతరం హైదరాబాద్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించిన సిరాజ్ అందుకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. 'రెస్ట్, రీస్టార్ట్, రీ ఫోకస్'అనే క్యాప్షన్తో జిమ్ వర్కౌట్ ఫొటోలను షేర్ చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా సిరాజ్ బౌలింగ్ ప్రాక్టీస్ సంబంధించిన వీడియోలను పంచుకుంది.
దాంతో సిరాజ్.. హిమాచల్ ప్రదేశ్తో జరిగే రంజీ మ్యాచ్ ఆడుతారని అంతా భావించారు. కానీ అతను బరిలోకి దిగలేదు. అయితే బీసీసీఐ మెడికల్ టీమ్ సూచనలతోనే సిరాజ్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా సిరాజ్కు బోర్డ్ రెస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అతను హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్ ఆడటం లేదు. విదర్భతో జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు.
ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆటలో హైదరాబాద్ 90 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్(137 బ్యాటింగ్) సెంచరీ సాధించాడు.