టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నల్ల బ్యాడ్జ్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు సంప్రదాయం ప్రకారం తమ జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్ ధరించి కనిపించారు.
టీమిండియా మాజీ పేస్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా తెలియజేసింది. డేవిడ్ జాన్సన్ అకాల మరణానికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరిస్తారని ట్వీట్ చేసింది.

52 ఏళ్ల డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జాన్సన్ తాను ఉండే ఇంటికి సమీపంలోనే క్రికెట్ కోచింగ్ అకాడమీ నిర్వహిస్తున్నారని, అది సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు సందేహిస్తున్నారు.
భారత్ తరఫున రెండు టెస్ట్లు ఆడిన జాన్సన్.. 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించాడు. కర్ణాటకకు చెందిన భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేశ్ తదితరులతో కలిసి ఆడాడు.
అఫ్గాన్తో మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ(8)ను ఫజలక్ ఫరూఖీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్తో కలిసి కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు.