
న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్ vs వెస్టిండీస్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సిన రెండో టీ20 మ్యాచ్ అనివార్య కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా మొదలవ్వనుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. మ్యాచ్ జరిగే బస్టెర్రెలోని వార్నర్ పార్క్కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ ప్రారంభం కావడం లేదని పేర్కొంది.
క్రికెట్ వెస్టిండీస్(CWI)లోని అనివార్య పరిస్థితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి మ్యాచ్ వేదికైన సెయింట్ కిట్స్కు ఇరు జట్ల లగేజి ఆలస్యంగా వచ్చింది. దాంతో గోల్డ్ మెడల్ కప్లో భాగంగా ఈ రోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వనుంది. ఈ అసౌకర్యం పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో పాటు అభిమానులు, స్పాన్సర్స్, బ్రాడ్కాస్ట్ పార్ట్నర్స్, స్టేక్హోల్డర్స్కు క్షమాపణలు తెలియజేస్తుంది'అని ఓ సీడబ్ల్యూఐ ప్రకటనను విడుదల చేసింది.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. 68 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య విండీస్ను ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక అదే జోరులో రెండో టీ20లో విజయం సాధించేందుకు సన్నదమైంది. ఈ సిరీస్కు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ను శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో విండీస్ గడ్డపై మరో విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్తో టీ20ల్లో రోహిత్తో పాటు రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను ఆరంభించగా.. విండీస్తో తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ పాత్ర పోషించాడు. ఈ ఏడాది టీ20ల్లో టీమ్ఇండియాకు ఏడో ఓపెనర్గా బరిలో దిగిన సూర్య ధాటిగా ఆరంభించిన ఇన్నింగ్స్ను భారీ స్కోరుగా మలచలేకపోయాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీతో ఖాళీ అయిన ఓపెనర్ స్థానంలో భారత్ ప్రయోగాలు కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరం. గత కొంతకాలంగా నాణ్యమైన ఎడమచేతి వాటం పేసర్ కోసం ఎదురుచూస్తున్న జట్టుకు అర్ష్దీప్సింగ్ రూపంలో జవాబు దొరికినట్లే కనిపిస్తుంది.