ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన టీమిండియా ఎలాంటి సంబరాలు లేకుండానే స్వదేశం చేరింది. జట్టులోని ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా స్వదేశం చేరారు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై చేరుకోగా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీకి వెళ్లిపోయాడు. రవీంద్ర జడేజా నేరుగా చెన్నైలో అడుగుపెట్టాడు. గతేడాది టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఓపెన్ బస్ పరేడ్లో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు.
ఈ సారి కూడా ఓపెనర్ పరేడ్ ఉంటుందని అంతా భావించారు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమ్కు బీసీసీఐ ఎలాంటి స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. ఆయా రాష్ట్రాలకు చెందిన అసోసియేషన్స్ సైతం విజేతలను పట్టించుకోలేదు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండటంతోనే బీసీసీఐ ఏలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీతో బిజీబిజీగా గడిపిన ఆటగాళ్లంతా.. రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకొని ఐపీఎల్ జట్లతో కలవనున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఎలాంటి సన్మాన కార్యక్రమాలు నిర్వహించలేదు.

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అప్పట్లో బీసీసీఐ ఘన స్వాగతం పలికింది. ముంబైలోని మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఓపెన్ టాప్ బస్లో జరిగిన ఈ రోడ్ షో గంటన్నర పాటు సాగింది. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సారి కూడా అలాంటి కార్యక్రమమే ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.