'వైభవ్ సూర్యవంశీ' ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన వక్తిగా వైభవ్ సూర్య వంశీ చరిత్ర సృష్టించాడు. సోమవారం ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ బీహార్ కుర్రాడిని కొనుగోలు చేసింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరీ రూ. కోటీ పది లక్షల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
దాంతో ఐపీఎల్ చరిత్రలోనే క్యాచ్ రిచ్ లీగ్లో భాగమైన అతిపిన్న వయస్కుడి వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. బీహార్లోని సమస్థిపుర్కు చెందిన వైభవ్ తండ్రి ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. వైభవ్ తండ్రి సంజయ్ సాధారణ రైతు. క్రికెట్పై అతనికి ఉన్న పిచ్చిని కొడుకుతో తీర్చుకోవాలనుకున్నాడు. కొడుకు ప్రాక్టీస్ కోసం ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు.

4 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్..
తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న వైభవ్.. కోచ్ల సాయంతో మరింత రాటు దేలాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే సూర్య వంశీ.. బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డేలో సెంచరీ సాధించి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు.
ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ ఆడేందుకు దుబాయ్లో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్.. వేలానికి ముందు అతన్ని ట్రయల్స్కు ఆహ్వానించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ ట్రయల్స్లో సూర్యవంశీ దుమ్మురేపాడు. ఒకే ఓవర్లో 17 పరుగులు చేయాలని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పెట్టిన టెస్ట్ను సూర్యవంశీ మూడు సిక్సర్లు బాది పాసయ్యాడని అతని తండ్రి తెలిపాడు.
13 ఏళ్ల బాలుడు ఐపీఎల్ ఆడొచ్చా..?
అయితే 13 ఏళ్ల పసిబాలుడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఆడే ఐపీఎల్ ఆడొచ్చా? క్రికెట్కు బాల కార్మికుల చట్టం వర్తించదా? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. బాల కార్మికల చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ ఎలాంటి పనులు చేయవద్దు.
ముఖ్యంగా డబ్బులు ఆర్జించే పనులు అస్సలు చేయకూడదు. ఇది క్రికెట్కు వర్తించదా? అనే సందేహం అందర్నీ వెంటాడుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్ల వయసుండాలి. మరీ ఐపీఎల్కు ఈ రూల్ వర్తించదా? అనేది అందరి ప్రశ్న.
ఐపీఎల్లో ఏ ఏజ్ లిమిట్.. కానీ!
అయితే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు ఎలాంటి వయసు పరిమితి లేదు. కానీ ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్ ఆడని అండర్ 19 ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఆస్కారం లేదు. 19 ఏళ్ల లోపు వయసున్న ఆటగాళ్లు ఎవరైనా.. లిస్ట్-ఏ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే ఐపీఎల్ ఆడేందుకు అర్హులు.
సూర్యవంశీ ఇప్పటికే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారత అండర్ 19 జట్టు తరఫున బరిలోకి దిగాడు. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ ఆడేందుకు ఎలాంటి అడ్డంకి లేదు. జట్టులోకి తీసుకున్నా అప్పుడే సూర్యవంశీకి రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు ఇవ్వదు. క్రికెటర్గా పూర్తి మెచ్యూరిటీ సాధించినంత తర్వాతే అతన్ని తుది జట్టులోకి తీసుకుంటారు. జట్టు భవిష్యత్తు కోసం అతన్ని ఎంపిక చేశారు.